మృగశిర కార్తె రోజు చేపలు ఎందుకు తింటారో తెలుసా..?.. రెండింటికీ ఉన్న సంబంధం ఏంటి?

Telugu Box Office

రోళ్లు పగిలే ఎండలను మోసుకొచ్చిన రోహిణికార్తె ముగిసింది. వాతావరణాన్ని చల్లబరిచే మృగశిర కార్తె నేటితో మొదలవుతోంది. మృగశిర కార్తెలో చేపలు తినడాన్ని మన పూర్వీకుల నుంచి ఆనాదిగా వస్తోంది. ఎండకాలం తర్వాత వాతావరణం చల్లబడటంతో మన శరీరంలో ఉష్ణోగ్రత తగ్గుతుంది. ఈ క్రమంలో వేడి ఉండేందుకు చేపలను తింటారు. దీని వల్ల గుండె జబ్బులు, ఆస్తమా రోగులకు ఉపశమనం కలుగుతుంది. ఇదేకాక ఈ సీజన్‌లో చాలా మందికి జీర్ణశక్తితో పాటు రోగ నిరోధక శక్తి తగ్గిపోతుంటుంది. జ్వరం, దగ్గు బారిన పడతారు. ఇలాంటి సమస్యల నుంచి గట్టెక్కాలంటే చేపలు తినాల్సిందే. పూర్వీకులు శాఖాపరమైన ఇంగువను బెల్లంలో కలుపుకొని ఉండలు.. ఉండలుగా చేసుకుని తినేవారు. మాంసాహారులైతే చేపలను ఇంగువలో, చింత చిరుగులో పెట్టుకుని తినేవారు. ఈ రోజు ఏ ఇంటా చూసినా చేపల పులుసే. చేపల కూర వంటకాలే కనిపిస్తుంటాయి. పులుసో, ప్రై చేసుకుని ఖచ్చితంగా తింటుంటారు.

మృగశిర కార్తె వస్తే చాలు రైతులు ఏరువాకకు సిద్ధమవుతుంటారు. అందుకే ఈ కార్తెను ఏరువాక‌ సాగే కాలం అంటుంటారు. ఏరువాక‌ అంటే నాగటి చాలు. ఈ కాలంలో నైరుతి ప్రవేశంతో తొల‌క‌రి జ‌ల్లులు కురుస్తుంటాయి. దీంతో పొలాలు దున్ని పంటలు వేయటం ప్రారంభిస్తుంటారు. మృగ‌శిర‌ కార్తె ఆరంభమైన రోజును వివిధ ప్రాంతాల్లో పలు పేర్లతో పండగ జరుపుకుంటారు. ఇక మృగశిర కార్తె అనగానే చేపలు గుర్తొస్తాయి. తొలిరోజు రోజు చేపలకు యమ గిరాకీ ఉంటుంది. ఏ మార్కెట్ చూసినా… రద్దీగా కనిపిస్తుంటాయి. ప్రతి పల్లెలోని చెరువుల వద్ద సందడి కనిపించే దృశ్యాలు దర్శనమిస్తుంటాయి.

చేపలలో ఉండే పోషకాలు:
▶ మృగశిర కార్తెలో చేపలు తినడం వల్ల అనారోగ్య సమస్యల నుంచి కాపాడుకోవచ్చు. ఇది శాస్త్రీయంగా నిరూపించబడింది.

▶ చేపల్లో బీ12 విటమిన్‌, రైబోప్లవిన్‌, నియాసిన్‌, బయెటిక్‌, థయామిన్‌ తదితర విటమిన్లు లభిస్తాయి.

▶ చేపలలో ఎన్నో పోషకాలున్నాయంటున్నారు వైద్య నిపుణులు. చేపలలో అనేకమైన మాంసకృతులతో పాటు శరీరానికి మేలు చేసే గుణాలు ఎన్నో ఉన్నాయి. కాల్షియం, పాస్పరస్‌, ఐరన్‌, మెగ్నీషియం, కాపర్‌, జింక్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి.

▶ చేపలు కొవ్వులు చాలా సులభంగాజీర్ణమై శక్తిని అందిస్తాయి. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకూ ఎవరైనా తినవచ్చు.

▶ మన రాష్ట్ర చేపల్లో కొర్రమీనులో లభించే ఆరాఖిడోనిక్‌ ఆమ్లం ఉంటుంది. ఇది గాయాలైనప్పుడు రక్తం తొందరగా గడ్డకట్టించే స్వభావం ఉంటుంది

▶ చేపల్లో ఉన్న కొవ్వు మన శరీరంలో రక్త పీడనంపై మంచి ప్రభావం చూపుతాయి.

▶ ఓమేగా 3 కొవ్వు ఆమ్లాలలో డీహెచ్‌ఏ, ఈపీఏ వంటివి కంటి చూపునకు ఎంతో మేలు చేస్తాయి. అలాగే జ్ఞాపకశక్తిని కూడా పెంచుతాయి.

▶ సముద్ర చేపల కాలేయంలో విటమిన్‌ఏ,డీ, ఈ వంటి విటమిన్లు పుష్కలంగా లభిస్తాయి.

▶ చేపలు గుండెకు సంబంధిత వ్యాధులకు, ఆస్తమా, షూగర్‌ వ్యాధి గ్రస్తులకు మంచి ఆహారంగా పని చేస్తుంది. ముఖ్యంగా గర్భిణులు, పిల్లల తల్లులకు ఎంతో మేలు. పిల్లల్లో జ్ఞాపకశక్తి, నాడీ వ్యవస్థ అభివృద్ధి చేస్తాయి చేపలు

▶ చేపలు తినడం వల్ల ముఖ్యంగా గుండె జబ్బులు, ఆస్తమా, మధుమోహ వ్యాధి ఉన్న వారు, గర్భిణులు ఈ సమయంలో చేపలు తింటే ఎంతో ప్రయోజనం ఉంటుంది.

▶ దేశీయ మార్పు చేపల్లో ఐరన్‌, కాపర్‌ వంటి ఖనిజ పోషకాలు ఎన్నో లభిస్తాయి. మృగశిర కార్తె రోజు చేపలను ఏ రూపంలో తిన్నా మన ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది.

▶ ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఉన్నందున స్థానికంగా దొరికే పెద్ద చేపలను ఇంగువ, చింత చిగురుతోకలిపి వండుకుని తింటే ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు.

Share This Article