నాలుగు శతాబ్దాల చరిత్రకు నీరాజనం.. మైసూర్ దసరా ఉత్సవాలు

Telugu Box Office

దసరాకు నెల రోజుల ముందు నుంచే మొదలయ్యే సంబరాలు.. దేశవిదేశాల నుంచి లక్షల సంఖ్యలో వచ్చే పర్యాటకులు.. ఏటా అధికారికంగా నిర్వహిస్తున్న కర్ణాటక ప్రభుత్వం… 1610 సంవత్సరం నుంచి నిరంతరాయంగా జరుగుతున్న ఉత్సవాలు.. ఇప్పటికీ రాజకుటుంబం చేతుల మీదుగా జరిపించే దసరా వేడుకలు.. గజరాజు మీద స్వర్ణ అంబారీపై చాముండేశ్వరీ దేవి ఊరేగింపు… విద్యుత్ దీపాల వెలుగులతో అలరారే మైసూర్ ప్యాలెస్..

తింటే గారెలే తినాలు.. వింటే భారతమే వినాలి అన్నట్టుగా చూస్తే మైసూరులో జరిగే దసరా వేడుకలనే చూడాలి. సుమారు నాలుగు వందల సంవత్సరాలుగా మైసూరులో దసరా వేడుకలు జరుగుతున్నాయి. దేశ విదేశాల నుంచి ఈ వేడుకలను చూడటానికి పర్యాటకులు భారీ సంఖ్యలో వస్తారు. మైసూరులో దసరా ఉత్సవాలు ఎంత వైభవంగా జరువుతారో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు.

మైసూరులో దసరా ఉత్సవాల సందడి నెల రోజుల ముందే ప్రారంభమవుతుంది. ఈ ఉత్సవాలను కర్ణాటక ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తుంది. బాలల దసరా, రైతుల దసరా, మహిళల దసరా, యువకుల దసరా… ఇలా మైసూరులో ఎవరి దసరా వాళ్ళు వేరువేరుగా చేసుకుంటారు. మైసూర్ పరిసరాల్లో, పరిసర గ్రామాల్లో అత్యంత వైభవోపేతంగా ఈ ఉత్సవాలను నిర్వహిస్తారు. ఆటల, పాటల పోటీలు, ప్రదర్శనలు, యువజనోత్సవాలు, ఆహారోత్సవాలు…. ఒక్కటేమిటి… దసరా సందర్భంగా అనేక వేడుకలు మైసూరులో నిర్వహిస్తారు. మైసూరుకు చెందిన రాజకుటుంబం 400 సంవత్సరాల క్రితం ప్రారంభించిన వేడుకలు నేటికీ అంతే ఉత్సాహంతో, అంతే భక్తి శ్రద్ధలతో జరుగుతూ ఉండటం విశేషం.

మైసూరులో 1610వ సంవత్సరం నుంచి దసరా వేడుకలు జరువుతున్నారని చరిత్ర చెబుతోంది. వడయార్ రాజ వంశం ఈ వేడుకలను ప్రారంభించింది. అంతకుముందు శ్రీరంగ పట్నం రాజధానిగా పరిపాలన చేసిన వడయార్ వంశీకులు1610లో తమ రాజధానిని మైసూరుకు మార్చారు. అప్పటి నుంచి దసరా వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. భారత దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన తర్వాత మైసూర్ రాజ్యాన్ని భారతదేశంలో విలీనం చేశారు. అయినప్పటికీ ఇప్పటికీ మైసూరు దసరా వేడుకలు రాజకుటుంబం చేతుల మీదుగానే జరుగుతున్నాయి. దసరా ముందు జరిగే వేడుకల సంగతి అలా వుంచితే, దసరా రోజున జరిగే కీలకమైన వేడుక కన్నులకు విందు చేస్తుంది.. గజరాజు మీద స్వర్ణ అంబారీ ఉంచి, దానిలో చాముండి దేవి విగ్రహాన్ని ప్రతిష్టించి ఊరేగిస్తారు. ఒక చెట్టు కలపతో, 750 కిలోల బంగారం తాపడం చేసిన అంబారీ ఈ ఉత్సవాల్లో మరో ప్రధాన ఆకర్షణ. విజయదశమి నాడు ఈ అంబారీ రాజసం ఉట్టి పడేలా లక్షలాది మందికి కన్నుల పండుగ చేస్తూ మెసూర్ ప్రధాన వీధులగుండా సాగుతుంది. ఈ ఉత్సవాల్లో గజరాజులపై జంబూ సవారీయే కీలకమైన ఘట్టం. స్వర్ణ అంబారీ కట్టిన ఏనుగుతోపాటు మరికొన్ని ఏనుగులు సర్వాలంకార భూషితంగా ఈ వేడుకలో పాల్గొంటాయి. ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని తిలకించేందుకు దేశ విదేశాల నుంచి లక్షలాదిమంది భక్తులు మైసూరుకు తరలి వస్తుంటారు.

దసరాకు ముందు తొమ్మిది రోజులపాటు శక్తిమాతకు పూజలు జరుగుతాయి. దుర్గ, లక్ష్మీ, సరస్వతి, కాళీ, చాముండేశ్వరీ రూపాలను పూజిస్తారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించడం, వాటి ఆకులను పరస్పరం పంచుకోవడంతో పాటు నవమి నాడు ఆయుధ పూజ చేస్తారు. ఆయుధ పూజ రోజున అన్ని వృత్తుల వారు తమ పనిముట్లను, వాహనాలను శుభ్రంగా కడిగి వాటికి పూజలు జరపడం, మిఠాయిలు పంచుకోవడం ఆనవాయితీ. దసరా రోజున మైసూరు మహారాజా ప్యాలెస్‌ని లక్షలాది విద్యుద్దీపాలతో దేదీప్యమానంగా అలంకరిస్తారు. మెసూర్ మహారాజుల నివాసమైన ఈ ప్యాలెస్‌లోనే ఉత్సవాలకు సంబంధించిన విలువైన వస్తువులను భద్రపరుస్తారు. ప్యాలెస్‌లోని అత్యంత విలువైన బంగారు సింహాసనాన్ని దసరా వేడుకలు జరిగే 10 రోజుల పాటు ప్రజలకు తిలకించే అవకాశాన్ని కల్పిస్తారు. అంబారీ ప్రదర్శనకు ఒక రోజు ముందు దసరా దివిటీల ప్రదర్శన నిర్వహిస్తారు. ఇటీవలి కాలంలో లేజర్ షో కూడా ఏర్పాటు చేస్తున్నారు. దసరా సందర్భంగా మైసూరులో వివిధ శకటాల ప్రదర్శన జరుగుతుంటుంది. ఇందులో వివిధ జిల్లాలు, శాఖల అభివృద్ధిని ప్రదర్శించడం ఆనవాయితీగా వస్తోంది. ఉత్సవాలను మైసూర్ ప్రజలు తమ వారసత్వంగా భావిస్తూ భక్తిశ్రద్ధలతో జరువుకుంటారు.

దసరా సందర్భంగా ప్రతి ఇల్లూ దసరా శోభతో కళకళలాడుతూ వుంటుంది. ప్రతి ఇంట్లోనూ బొమ్మల కొలువులు ఏర్పాటు చేసుకుంటారు. ఒక్క మాటలో చెప్పాలంటే మైసూరు దసరా వేడుకల గురించి మాటల్లో చెప్పలేం. రెండు కళ్లతో ప్రత్యక్షంగా చూసి తీరాల్సిందే. ఈ పండుగ సందర్భంగా మైసూర్లోని అమ్మవారు చాముండేశ్వరీ దేవిని పూజించటం ఆనవాయితీ. విజయనగర రాజుల కాలంలో 15వ శతాబ్దంలో ఈ ఉత్సవాలు మొదలైనట్లు చారిత్రక ఆధా రాల ద్వారా తెలుస్తోంది. పర్షియాకు చెందిన రాయబారి అబ్దుల్ రజాక్ తన వుస్తకంలో విజయనగర రాజులు నిర్వహి స్తున్న దసరా ఉత్సవాల గురించి రాసుకున్నాడు. విజయనగర సామ్రాజ్య పతనానంతరం మైసూరు రాజులైన ఉడయార్లు మైసూరుకు దగ్గర్లో ఉన్న శ్రీరంగపట్నంలో దసరా ఉత్సవాలు ప్రారంభించారు. రాజా ఉడయార్ .. 1610లో ఈ ఉత్సవాలను మొదలుపెట్టగా.. 1805లో కృష్ణరాజు ఉడయార్ కాలం నుంచి దసరా నాడు మైసూరు ప్యాలస్‌లో ప్రత్యేక రాజదర్బారు నిర్వహించడం ఆనవాయితీగా మారింది.

Share This Article