13వేల అడుగుల ఎత్తులో.. 1100 సంవత్సరాల బొజ్జ గణపయ్య

Telugu Box Office

ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్ పేరు చెప్పగానే దట్టమైన అడవులు గుర్తొస్తాయి. మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌లలో విస్తరించిన దండకారణ్యంలో ఎక్కువ భాగం ఛత్తీస్‌గఢ్ పరిధిలోనే ఉంటుంది. ఈ ప్రాంతంలో మావోయిస్టుల ప్రాబల్యం బాగా ఎక్కువే. బస్తర్, దంతెవాడ పేరు చెప్పగానే పోలీసులు, మావోయిస్టుల మధ్య ఆధిపత్య పోరే కళ్ల ముందు మెదలాడుతుంది. కానీ ఈ కీకారణ్యంలోని ఓ కొండ మీద ప్రాచీన కాలం నాటి వినాయకుడి విగ్రహం ఉండటం విశేషం.

దేశంలో ఎన్నో గణపతి ఆలయాలు ఉన్నప్పటికీ దట్టమైన అడవుల్లో ఈ వినాయకుడి విగ్రహం ప్రకృతి ప్రేమికులను ఎంతగానో అలరిస్తుంటుంది. కొండ శిఖరాగ్రంలో డోలు లాంటి ప్రదేశంలో విఘ్నేశ్వరుడు మనకు దర్శనం ఇస్తాడు. అందుకే ఈ వినాయకుడిని దోల్‌కల్ గణేశ్ అని పిలుస్తుంటారు. ఈ విగ్రహం 1100 ఏళ్ల క్రితం నాటిది కావడం విశేషం. నాగవంశీయుల కాలంలో అడవి లోపల 14 కి.మీ. దూరంలో కొండపై ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. వెయ్యేళ్లకుపైగా చరిత్ర ఉన్నప్పటికీ.. దట్టమైన అడవిలో ఉన్న కారణంగా ఆ విగ్రహం గురించి ఇటీవలి వరకూ బయటి ప్రపంచానికి తెలియలేదు.

2012లో స్థానిక జర్నలిస్టు ఒకు దోల్‌కల్ కొండ ఎక్కగా శిఖరాగ్రాన ఆరు అడుగులు ఎత్తైన వినాయకుడి విగ్రహం దర్శనం ఇచ్చింది. 13 వేల అడుగుల ఎత్తులో ఉన్న ఈ ప్రదేశానికి చేరడం అంత తేలికేం కాదు. ముందుగా దంతెవాడ చేరుకొని అక్కడికి 20 కి.మీ. దూరంలో ఉన్న మిడ్‌కుల్నర్ అనే చిన్న గ్రామానికి వెళ్లాలి. అక్కడి నుంచి 5-7 కిలోమీటర్లు కొండలు, గుట్టలు దాటుకుంటూ వెళ్తే గానీ ఈ ప్రదేశానికి చేరుకోలేం. ఇప్పుడు మావోయిస్టుల సమస్య కొద్దిగా తగ్గింది గానీ.. గతంలో ఇక్కడ మావోల ప్రాబల్యం ఎక్కవగా ఉండేది. గతంలో ఈ విగ్రహం కొండ మీది నుంచి కిందకు పడి ముక్కలైంది. వినాయకుడి విగ్రహాన్ని చూడటానికి పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తుండటంతో.. ప్రభుత్వం ఇక్కడ అభివృద్ధి పనులు చేపట్టింది. ఇవన్నీ తమ కార్యకలాపాలకు ఆటంకం కలిగిస్తాయనే ఉద్దేశంతో మావోయిస్టులే ఈ విగ్రహాన్ని కొండ మీద నుంచి కిందకు తోసేసి ఉంటారని పోలీసులు అనుమానించారు.

కొండ మీద విగ్రహం కనిపించడం లేదని ప్రచారం జరగడంతో ఇది చోరీకి గురైందని భావించారు. కొందరు వ్యక్తులు ఓ గ్రూప్‌గా ఏర్పడి విగ్రహం వెతుకులాట ప్రారంభించారు. కొండ కింది ప్రాంతంలో ఈ విగ్రహం ముక్కలు లభ్యమయ్యాయి. దీంతో దంతెవాడ ఎస్పీ కమలోచన్ కశ్యప్, కలెక్టర్ సౌరభ్ కుమార్ ఇతర అధికారులతో కలిసి ఈ ప్రాంతాన్ని తనిఖీ చేశారు. తర్వాత విగ్రహాన్ని పునఃప్రతిష్టించారు.

ఏకదంతుడైంది ఇక్కడేనట..
ఒక చేతిలో గొడ్డలి, మరో చేతిలో విరిగిన దంతం. కిందిభాగం కుడిచేతిలో రుద్రాక్ష మాల, మరో చేతిలో మోదకాలతో దర్శనమిస్తాడు డోల్‌కాల్‌ గణేశుడు. ఆయుధధారుడై ఉండడం దోల్‌కాల్‌ గణేశుడి ప్రత్యేకత. అక్కడ గణపయ్య లలితాసనంలో కనిపిస్తారు. బస్తర్‌లో తప్ప మరెక్కడా ఆయన ఆ భంగిమలో ఉండరు. బస్తర్‌ ప్రత్యేక నిపుణులు హేమంత్‌ కశ్యప్‌ ప్రకారం.. ఈ డోల్‌కాల్‌ శిఖరంపైనే వినాయకుడు-పరుశరామ్‌ మధ్య యుద్ధం జరిగింది. ఆ యుద్ధంలోనే గణేశుడి దంతం విరిగింది. అప్పటి నుంచే ఆయనను ఏకదంతుడిగా పిలుస్తున్నారు. ఆ ఘటనకు గుర్తుగా చిండక్‌ నాగవంశానికి చెందిన రాజు గణేశ్‌ విగ్రహమూర్తిని అక్కడ ప్రతిష్ఠించారట..

Share This Article