12ఏళ్లకోసారి పిడుగుల వర్షం.. ముక్కలై తిరిగి అతుక్కునే శివలింగం

Telugu Box Office

ఈ భూమిపై సైన్స్‌కి అంతుచిక్కని ఎన్నో రహస్యాలు ఉన్నాయి. వాటిలో బిజిలీ మహాదేవ్ ఆలయం ఒకటి. హిమాచల్‌ప్రదేశ్‌లోని కులు లోయలో ఉన్న ఈ ఆలయంలో ఉన్న శివలింగానికి గల ప్రత్యేకత గురించి తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. జీవితంలో ఒక్కసారైనా ఆ ఆలయాన్ని సందర్శించి శివలింగాన్ని దర్శించుకోవాలని తపించిపోతారు. కులు లోయ పవిత్రమైన ఒడిలో శివుడికి సంబంధించిన శాశ్వతమైన ఉనికి ఉందని చాలా మందికి తెలియదు. స్వర్గధామమైన ఈ లోయలో సుమారు 2,460 మీటర్ల ఎత్తులో కొన్ని యుగాలుగా బిజ్లీ మహాదేవ్ ఆలయం ఉంది. ఈ పుణ్య క్షేత్రానికి కులు నుండి 22 కిలోమీటర్ల దూరం. మూడు కిలోమీటర్ల పొడవైన ట్రెక్ ద్వారా ఇక్కడికి చేరుకోవచ్చు. ఇక్కడి సుందరమైన ప్రకృతి దృశ్యాలు పర్యాటకులను మంత్ర ముగ్ధులను చేస్తాయి.

ప్రతి 12 సంవత్సరాలకోసారి ఈ శివాలయంపై పిడుగుల వర్షం కురుస్తుంది. ఆ సమయంలో శివలింగం ముక్కలు ముక్కలుగా ధ్వంసమవుతుంది. అప్పుడు ఆలయ పూజారులు ఆచారంలో భాగంగా వెన్నతో పాటు తృణధాన్యాలు, కాయ ధాన్యాల పిండిని ఉపయోగించి ఆ ముక్కలను అతికిస్తారు. కొన్ని నెలల తర్వాత శివలింగం సాధారణ ఆకృతిలోకి వస్తుంది. ఇది ఎంతో విస్మయానికి గురి చేసే సంఘటన. ప్రతి 12 ఏళ్లకు ఒకసారి ఇది క్రమం తప్పకుండా జరగడం విశేషం. ఈ శివలింగాన్ని స్థానికులు వెన్న మహాదేవ్, బిజ్లి మహదేవ్ అని పిలుస్తారు. ఈ పిడుగులు శివలింగంతో పాటు ఆ ప్రాంతానికి ప్రత్యేక శక్తులు ఇస్తాయని అక్కడి ప్రజలు విశ్వసిస్తారు.

ఈ ఆలయానికి సంబంధించిన ఒక పురాణ గాథ కూడా ఉంది. కులుంత అనే రాక్షసుడు కులు లోయలో నివసించేవాడు. అతడు ఒక సర్ప రూపాన్ని ధరించి లాహౌల్ – స్పితిలోని మాథన్ గ్రామానికి చేరుకుంటాడు. అక్కడ బియాస్ నదికి గండి పెట్టి ప్రజలు వరదలతో చనిపోయేలా చేయాలని అనుకుంటాడు. దీంతో ఆగ్రహించిన పరమ శివుడు ఆ రాక్షసున్ని అడ్డుకునేందుకు వెళతాడు. కులంతతో భీకర యుద్ధం చేసిన తరువాత పాము రూపంలో ఉన్న రాక్షసున్ని సంహరిస్తాడు. మరణించిన తరువాత కులంత దేహం మొత్తం భారీ పర్వతంగా మారుతుంది. అప్పుడు శివుడు ప్రతి 12 సంవత్సరాలకు ఓసారి ఇక్కడ మెరుపు విసరాలని ఇంద్రుడిని ఆజ్ఞాపిస్తాడు. ఆ సమయంలో ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం జరగకూడదని కూడా సూచిస్తాడు. కులుంత అనే రాక్షసుడు ఇక్కడ చనిపోవడం వలన ఈ ప్రాంతానికి తరువాతి కాలంలో కులు లోయ అని పేరు స్థిరపడినట్లు చెబుతారు.

ఈ పవిత్రమైన పురాతన శివ మందిరాన్ని సందర్శించాలంటే 1000 మెట్లు ఎక్కాల్సి ఉంటుంది. చుట్టుపక్కల పొడవైన దేవదార్ వృక్షాలు, కులు లోయ యొక్క అందమైన దృశ్యాలు సందర్శకుల అలసటను మాయం చేస్తాయి. పర్వతం పైన సందర్శకులకు కులు, పార్వతీ లోయ అద్భుతమైన దృశ్యాలను వీక్షించే అవకాశం దొరుకుతుంది. శివరాత్రితో పాటు శ్రావణ మాసంలో ఈ మందిరం భారీ ఉత్సవం జరుగుతుంది. ఈ ఉత్సవం చూసేందుకు స్థానిక భక్తులతో పాటు ఇతర ప్రాంతాల యాత్రికులు తరలివస్తుంటారు.

Share This Article