మధుర మీనాక్షి ఆలయం

Telugu Box Office

మధుర మీనాక్షి ఆలయం తమిళనాడులోని మదురై పట్టణం వేగాయి నడి ఒడ్డున ఉంది. తమిళనాడులోని అతిపెద్ద నగరాల్లో ఒకటైన మధురై… దక్షిణ భారతదేశంలోనే ప్రముఖ పుణ్యక్షేత్రాల్లో ఒకటిగా నిలిచింది. తమిళ సంస్కృతి, కళలు, సాంప్రదాయ వారసత్వాలకు నిలయంగా ఈ నగరం విలసిల్లుతోంది. మీనాక్షీ, సుందరేశ్వరుల ఆలయ నిలయంగా ప్రసిద్ధి చెందింది. సుందరేశ్వరుడు సాక్షాత్తు శివుడు, .యన భార్య సాక్షాత్తు పార్వతీ దేవి. ఈ సుందర నగరాన్ని కవీశ్వరులు, గాయకులు దివ్యమైనదిగా గానం చేశారు. శక్తి స్వరూపిణి అయిన దేవి, మానవ రూపంలో అవతరించి పాండ్య రాజ పుత్రికగా రాజ్యాన్ని పరిపాలించి భక్తుల రక్షణ కోసం దివ్య మహిమలు ప్రదర్శించి, పరమ శివుని సతీమణి అయింది.

ప్రపంచంలోని అతి పురాతన నగరాలలో ఒకటైన మదురై అనేక రాజ వంశాల పాలనలు చూసింది. చోళులు, పాండ్యులు, విజయనగర రాజులు, బ్రిటిష్ పాలకులు ఎంతో మంది ఈ నగరాన్ని అభివృద్ధి పరచారు. అనేక స్మారకాలు, దేవాలయాలు .భారత దేశ సంస్కృతి, కళలు, ఆధ్యాత్మికతలలో ప్రధాన పాత్ర వహించే నగరాలలో మదురై పట్టణం ఒకటి. 2500 ఏళ్ల క్రితమే సుందరేశ్వర్‌ ఆలయం (మీనాక్షి అమ్మవారి ఆలయం) నిర్మించారని చారిత్రక ఆనవాళ్లు చెబుతున్నాయి. ఈ గుడి ఆ కాలపు జీవన విధానాన్ని ప్రతిబింబిస్తుంది. అద్భుతమైన శిల్ప, చిత్ర కళారీతులతో ఉన్న ఈ దేవాలయం తమిళ సంస్కృతికి చిహ్నం. దీని గురించి తమిళ సాహిత్యంలో పురాతన కాలం నుంచి ప్రస్తావిస్తున్నారు.

స్థల పురాణం
మదురై పాలకుడు మలయధ్వజ పాండ్య చేసిన ఘోర తపస్సుకు మెచ్చి పార్వతి దేవి చిన్న పాప రూపంలో భూమ్మీదకు వచ్చింది. ఆమెను పెళ్లాడటానికి శివుడు సుందరేశ్వరుడుగా అవతరించాడు. అమ్మవారు పెరిగి పెద్దదై ఆ నగరాన్ని పాలించసాగింది. విష్ణుమూర్తి తన చెల్లి పెళ్లి చేయడానికి వైకుంఠం నుంచి బయలు దేరుతాడు. అయితే అనుకున్న సమయానికి రాలేకపోతాడు. స్థానిక దేవుడు పవలాకనైవాల్‌ పెరుమాళ్‌ ఈ వివాహం జరిపిస్తాడు. ఈ వివాహాన్నే ప్రతి ఏటా ‘చిత్తిరై తిరువళ’గా వేడుకగా నిర్వహిస్తున్నారు.

తమిళ గ్రంథం తిరువవిలై యాతర పురాణంలోని కథనం ప్రకారం.. ఒకప్పుడు మధురై ప్రాంతాన్ని పాలించిన మలయధ్వజ పాండ్యరాజుకు చాలా కాలం వరకూ సంతానం కలగలేదు. దానితో ఆయన తన భార్య కాంచనమాలతో కలిసి పుత్ర సంతానం కోసం ఒక యజ్ఞం చేశాడు. అయితే ఆయనకు పుత్రునికి మారుగా అప్పటికే మూడేళ్ల వయసున్న ఒక పుత్రిక జన్మించింది. ఆమెకు మూడు రొమ్ములు ఉన్నాయి. ఇదేమిటా అని తల్లి తండ్రులు ఆలోచిస్తున్నంతలో శివుడు ప్రత్యక్షమై ఆమెను కొడుకు మాదిరి పెంచమని ఆమె తన భర్తను కలిసిన మరుక్షణం మూడవ రొమ్ము మాయమవుతుందని చెప్పాడు. తల్లితండ్రులు ఆమెకు పుత్రుని మాదిరి యుద్ధ విద్యలు నేర్పించారు. వాటిలో ఆమె ప్రావీణ్యం గడించింది. రాజ్యాలను గెలుచుకుంది. ఒక రోజు ఆమె ఎదుట శివుడు ప్రత్యక్షమయ్యాడు. శివుని దర్శించగానే ఆమె మూడవ రొమ్ము మాయమైంది. దానితో ఆయనే తన భర్త అని ఆమె గ్రహించింది. పార్వతీ దేవి మరో రూపమైన ఆమెను శివుడు వివాహమాడాడు. వారిద్ద్దరూ కొంత కాలం మధురై నగరాన్ని పాలించారు. ఆ తర్వాత వారికి ఒక కుమారుడు కలిగాడు. అతనికి ఉగ్ర పాండ్యన్‌ అని పేరు పెట్టారు. ఇతనిని మురుగన్‌ (కుమారస్వామి ) అపర అవతారంగా పేర్కొంటారు. వారు అతనిని సింహాసనంపై కూర్చోపెట్టి తాము సుందరేశ్వర మీనాక్షిలుగా ఆలయంలో కొలువు తీరారు. పేరెన్నికగన్న మధురై మీనాక్షి ఆలయం ప్రస్తావన 6వ శతాబ్దానికి చెందిన తమిళ సంగమ సాహిత్యంలో కనిపిస్తుందని అంటారు. ఈ ఆలయం ప్రాచీన గ్రంథాల్లో ఉన్నా, 14వ శతాబ్దం అనంతరమే ప్రస్తుత ఆలయం నిర్మాణం జరిగిందని చెబుతారు.

ఆలయ నిర్మాణం
ఈ ఆలయం 15 ఎకరాలలో విస్తరించి ఉంది. సుందరపాండ్యన్‌, పరాక్రమ పాండ్యన్‌లు 13,14 శతాబ్దాల్లో తూర్పు, పశ్చిమ గోపురాలను, 16వ శతాబ్దంలో శివ్వంది చెట్టియార్‌ దక్షిణ గోపురాన్ని కట్టించారు. తూర్పు గోపురం సమీపంలో అష్టలక్ష్మీ మండపం ఉంటుంది. ఇక్కడ మొత్తం 16 గోపురాలు ఉన్నాయి. దాదాపు 33000 శిల్పాలు ఉన్నాయి. 1000 స్థంభాల మండపం ప్రధాన ఆకర్షణ.

దండయాత్రలు
శైవ తత్వశాస్త్రానికి చెందిన తిరుజ్ఞాన సంబన్‌దార్‌ ఈ ఆలయం గురించి ఏడవ శతాబ్దంలో పేర్కొన్నాడు. అనంతం ఖిల్జీ సేనాన, మాలిక్‌ కపూర్‌ దీన్ని ఈ ఆలయాన్ని కూల్చివేశారు.ఈ దాడిలో గుడికి సంబంధించిన ఆనవాళ్లన్నీ ధ్వంసమైపోయాయి.

పునర్నిర్మాణం
16వ శతాబ్దంలో మదురై మొదటి నాయక రాజు విశ్వనాథనాయకుడు ఈ గుడి పునర్నిర్మాణానికి పూనుకున్నాడు. తరువాత తిరుమల నాయక రాజు దీని అభివృద్ధికి పెద్ద ఎత్తున ధన సహాయం చేశాడు.


పండుగలు
మీనాక్షి తిరుకల్యాణం ఈ ఆలయంలో జరిగే ముఖ్యమైన పండుగ. దీన్ని ఏటా ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. రథోత్సవం, తెప్పోత్సవంతో పాటు పలు ఉత్సవాలు జరుపుతారు. ఇక్కడ నవరాత్రి, శివరాత్రి ఉత్సవాలను వైభవంగా నిర్వహిస్తారు.

Share This Article