మార్గశిర మాసం – ముక్తికి మార్గం

Telugu Box Office

చాంద్రమాన సంప్రదాయాన్ని అనుసరించి మృగశిర నక్షత్రంతో కలసిన పౌర్ణమి నాడు చంద్రుడు ఉదయించే నెలను మార్గశిర మాసం అంటారు. ఈ నెల విష్ణుదేవుని రూపం. ఈ మాసం ప్రకృతి కాంతకు సీమంతం లాంటిది. తుషార బిందువుల హేమంతం. శ్రీమహావిష్ణువుకు అత్యంత ఇష్టమైన మాసం.
భగవద్గీతలోని విభూతియోగంలో – “మాసానాం మార్గశీర్షం” అంటే మాసాల్లో తాను మార్గశిర మాసానని అన్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ నెలలో సూర్యోదయం కంటే ముందు చన్నీటితో తలస్నానం చేసిన వారికి చలి బాధ ఉండదు. బ్రహ్మ ముహూర్తంలో నీటిలో అగ్ని, సూర్యుడు కలసి ఉంటారని శాస్త్రం సూచిస్తుంది. అందువలన బ్రహ్మ ముహూర్తంలో స్నానం చేయడం ఎంతో ఆరోగ్యప్రదం, సంధ్యా వందన జపధ్యానాదులను నిర్వహించడం వల్ల సూర్యశక్తి, అగ్నితేజము కూడా మన మనస్సును, బుద్ధిని వికసింపజేస్తాయి.

అందుకే…. మార్గశిర మాసంలో – ధనుర్మాసం మొదలైన నాటి నుంచి విధిగా తెల్లవారుఝాముననే నిద్రలేచి స్నానం చేయడం ఆచారంగా వస్తుంది. ఈ నెలలో మొదటి రోజు నదులలో స్నానం చేసి శ్రీలక్ష్మిసమేత శ్రీమహవిష్ణువుని స్మరించుకొని నదులలో దీపాన్ని విడిచిపెట్టిన వారికి ఆరోగ్యంతో పాటు సకల సంపదలు కలుగుతాయి. ఈ మాసమంతా శ్రీ విష్ణువును తులసీ దళముతో పూజించడం పుణ్యప్రదం. ద్వాదశినాడు పంచామృతాలతో అభిషేకం చేయాలి. శ్రీ విష్ణువుతో పాటు సూర్యున్ని కూడా పూజించి శుభాలను పొందాలని కోరుతూ మనం ఏ పనిచేస్తున్నా ఈ మాసంలో… “ఓం నమో నారాయణయ” అనే మంత్రాన్ని స్మరించాలి. ప్రతిరోజు బ్రహ్మ ముహూర్తంలో తులసి వృక్ష సన్నిధిలోని తులసి ఆకులను తీసికొని, ‘ఓం నమో నారాయణాయ’ అనే మంత్రాన్ని పఠిస్తూ శరీరానికి పూసుకుని స్నానమాచరించాలి. ఈ మార్గశిరమాసం ఎన్నో పుణ్యదినములకు నెలవు.

మార్గశిర శుద్ధ షష్ఠి ‘స్కంద షష్ఠి’.. శివకుమారుడైన కుమారస్వామి ఈరోజున తారకాసురున్ని సంహరించాడని ఈ తిథి అతనికి ప్రియమైనదని శాస్త్రాలు తెలుపుతున్నాయి. తెలుగువారు దీన్ని ‘సుబ్రహ్మణ్య షష్ఠి’ అని అంటారు. మార్గశిర శుద్ధ ఏకాదశి ‘వైకుంఠ ఏకాదశి’. దీన్నే ‘మోక్ష ఏకాదశి’ అని అంటారు. ఆ రోజున విష్ణువు ఆలయాలలో ఉత్తరద్వారం నుంచి వెళ్లి దర్శనం చేసుకుంటే మోక్షం తథ్యమని భక్తుల విశ్వాసం. తిరుపతి, శ్రీరంగంవంటి వైష్ణవ క్షేత్రాల్లో ఆరోజు గొప్ప ఉత్సవం. వైకుంఠ ద్వారం సూర్యుని ఉత్తరాయణ ప్రవేశచిహ్నంగా భావిస్తారు.

మోక్షదా ఏకాదశి… “గీతాజయంతి”. సమస్తమానవాళికి ధర్మ నిధి, భారతీయ ఆధ్యాత్మిక జగత్తులో శిఖరాయమానం అయిన భగవద్గీతను కృష్ణ భగవానుడు ప్రబోధించిన రోజు. మార్గశిర బహుళ ఏకాదశిని విమలైకాదశి , సఫలైకాదశి అనికూడా పిలుస్తారు. త్రిమూర్తులైన బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల సమైక్య స్థితి దత్తాత్రేయుడు. ఈ “దత్తాత్రేయ జయంతి”ని మార్గశిరంలోనే శుక్ల పూర్ణిమ నాడు జరుపుకొంటారు. మార్గశిర శుక్ల త్రయోదశినాడు “హనుమద్‌ వ్రతం”, “మత్స్య ద్వాదశి”, “ప్రదోష వ్రతం”* ఆచరించడం పరిపాటి. ఈ మాసంలోనే…. అనంత తృతీయ, నాగపంచమి, సుబ్రమణ్యషష్టి, పరశురామ జయంతి, సంకటహర చతుర్ధి, ఫలసప్తమి, కాలభైరవాష్టమి, రూపనవమి, సఫలా ఏకాదశి, కృష్ణ (మల్ల) ద్వాదశి, యమదర్శన త్రయోదశి, ప్రదోష వ్రతం తదితర పండుగలు వస్తాయి.

పెద్దలు ఈ మాసాన్ని మోక్ష మాసంగా లేదా మోక్ష సాధనా మాసం అని కూడా అంటూ ఉంటారు. భక్తితో ఉపవాసం, జాగరణ ఉండి చేసే మోక్షద ఏకాదశి కూడా ఈ మాసంలోనే వస్తుంది. నిజానికి ఈ మాసానికి ఎందుకంత ప్రాముఖ్యత అంటే… మార్గశిరం తరువాత వచ్చే పుష్య మాసం నుండి ఉత్తరాయణం మొదలు అవుతుంది. ఉత్తరాయణం దేవతలకు పగటి కాలం. అలా చూసుకుంటే దక్షిణాయనం చివరిభాగం , ఉత్తరాయణం ముందు వచ్చే భాగం అయిన మార్గశిరం పగలుకు ముందు వచ్చే బ్రహ్మ ముహూర్తం లాంటిది అని తెలుస్తుంది. బ్రహ్మ ముహూర్తం రోజులో ఎంత ప్రాధాన్యత కలిగిందో , సంవత్సరానికి స్వయం విష్ణుస్వరూపమైన మార్గశిరం కూడా అంతే ప్రాధాన్యత కలిగినది. ఎలాగైతే బ్రహ్మ మహూర్తంలో మనం నిత్య పూజ చేసుకుంటామో , అదే విధంగా దేవతలకు బ్రహ్మ ముహూర్తమైన ఈ మాసమంతా దేవతలు , ఋషులు , యోగులు శ్రీమహావిష్ణువును భక్తితో పూజిస్తారు. ఈ మాసం లక్ష్మీనారాయణ స్వరూపం. శ్రావణ శుక్రవారం , కార్తీక సోమవారం లాగా మార్గశిర లక్ష్మివారం (గురువారం) , మార్గశిర శనివారం చాలా ప్రాముఖ్యమైనవి. ఎన్నో విశిష్టతలతో కూడిన మాసం కావున శ్రీమన్నారాయణ్ణున్ని తరించి జన్మసార్ధకం చేసుకునేందుకు, భక్తి భావనను పెంపోదించుకొనుటకు దాన ధర్మాలను ఆచరింస్తూ పుణ్యఫలంను దక్కించుకొనేందుకు ఈ మార్గశిరం సమస్త మానవాళికి ఎంతగానో ఉపయోగకారిగా నిలుస్తుంది.

Share This Article