పళని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం.. విషాలతో తయారుచేసిన విగ్రహం

Telugu Box Office

ఆది దంపతులైన శివపార్వతుల ముద్దుల తనయుడు కుమారస్వామి. ఆయనకు స్కందుడు, కార్తికేయుడు, శరవణుడు, సుబ్రహ్మణ్యుడు అనే పేర్లు కూడా ఉన్నాయి. ఆయనకు తమిళనాడులో ఎన్నో ప్రసిద్ధ క్షేత్రాలున్నాయి. వాటిలో పళని ఒకటి. ఇక్కడ కొలువైన స్వామిని అరుల్‌ ముగు శ్రీ దండాయుధపాణి స్వామిగా పిలుస్తారు. ఈ క్షేత్రం తమిళనాడులోని దిండుగల్‌ జిల్లాలోని పళనిలో కొలువై ఉంది. ఇది మదురైకి 120 కిలోమీటర్ల దూరంలో ఎతైన కొండలపై ఉంటుంది.

శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి క్షేత్రాల్లో ప్రఖ్యాతి గాంచిన మహా మహిమాన్వితమైన దివ్య క్షేత్రం పళని. ఇక్కడ స్వామి వారిని దండాయుధపాణి అనే నామంతో కొలుస్తారు. తమిళం వాళ్ళు ఈయనను “పళని మురుగా” అని కీర్తిస్తారు. ఈ క్షేత్రం చాలా పురాతనమైనది. స్వామి చేతిలో ఒక దండం పట్టుకుని, కౌపీన ధారియై, వ్యుప్త కేశుడై నిలబడి, చిరునవ్వులొలికిస్తూ ఉంటారు. అదే స్వరూపం భగవాన్ శ్రీ రమణ మహర్షిది. భగవాన్ రమణులు సుబ్రహ్మణ్య అవతారము అని పెద్దలు చెప్తారు. ఇక్కడ స్వామి వారు కేవలం కౌపీనంతో కనబడడంలో అంతరార్ధం “నన్ను చేరుకోవాలంటే అన్నీ వదిలేసి నన్ను చేరుకో” అని మనకి సందేశము ఇస్తున్నారు అని అర్ధం. అంటే ఈ పళని క్షేత్రము జ్ఞానము ఇచ్చే క్షేత్రము.

పురాణ గాథ
ఒకసారి నారదుడు కైలాసాన్ని దర్శించి శివపార్వతులకు జ్ఞాన ఫలాన్ని అందిస్తాడు. అది వారిద్దరి కుమారుల్లో ఎవరో ఒకరికి అందించమని చెబుతాడు. అయితే ఆ ఫలాన్ని అందుకునే అర్హత ఎవరికి ఉందో తెలుసుకోవడానికి కుమారులిద్దరినీ ముల్లోకాలను తిరిగి రమ్మని వారు చెబుతారు. వెంటనే కుమార స్వామి తన నెమలి వాహనం తీసుకుని లోకాల ప్రదక్షిణకు వెళ్తాడు. కానీ కార్తికేయుడు ఎక్కడికి వెళ్లినా అక్కడ ముందుగానే వినాయకుడు దర్శనమిస్తాడు. తిరిగి కైలాసాన్ని చేరుకుని జరిగిన విషయం తెలుసుకుంటాడు. వినాయకుడు తల్లిదండ్రులకు ప్రదక్షిణ చేసి ముల్లోకాల ప్రదక్షిణ పూర్తి చేశాడని తెలుసుకుని, నిరాశగా స్కందుడు భూలోకంలోని పళని ప్రదేశానికి చేరుకుంటాడు. కార్తికేయుడు చిన్నబుచ్చుకుని కైలాసం వదిలి భూలోకం వచ్చి పళనిలోని ఒక కొండ మీద మౌన ముద్రలో ఉంటాడు. విషయం తెలుసుకున్న గౌరీశంకరులు అక్కడకు చేరుకుంటారు. పరమశివుడు ప్రేమతో సుబ్రహ్మణ్యుడిని ఎత్తుకుని ­ఊరడిస్తాడు.

అప్పుడు శివుడు కుమారా.. సకల జ్ఞానాలకు నీవే ఫలానివి అని బుజ్జగిస్తాడు. సకల జ్ఞాన ఫలం అంటే తమిళంలో పళం, నీవు అంటే నీ ఈ రెండు కలిపి పళని అయ్యింది. అంతటితో ప్రసన్నుడైన సుబ్రహ్మణ్యుడు ఎప్పటికీ శాశ్వతంగా ఈ కొండ మీదే కొలువు ఉంటానని తల్లిదండ్రులకు చెబుతాడు. అందుకు సరేనన్న శివపార్వతులు కైలాసానికి తిరిగి వెళ్తారు. పూర్వ కాలంలో ఇక్కడ పళని స్వామి దేవతా మూర్తి తొడ భాగం నుంచి విభూతి తీసి భక్తులకు పంచేవారు. అలా చేస్తూ ఉండటంవల్ల స్వామి వారి విగ్రహం అరిగిపోతూ వచ్చింది. దీంతో కొద్దికాలం తర్వాత అలా పంచడాన్ని నిలిపేశారు. మొదటగా స్వామి వారి ఆలయాన్ని ఏడో శతాబ్దంలో కేరళ రాజు చీమన్‌ పెరుమాళ్‌ నిర్మించారు. తర్వాత పాండ్యులు పునరుద్ధరించారు.

స్వామి వారి విగ్రహాన్ని అత్యంత విషపూరితమైన నవపాషాణాలతో(తొమ్మిది రకాల విష పదార్థాలు) మహర్షి సిద్ధ భోగార్‌ ముని తయారు చేశారు. ప్రపంచంలో ఇలాంటి స్వరూపం మరెక్కడా లేదు. పూర్వకాలంలో ఇక్కడ పళని స్వామి వారి మూర్తిలో ఊరు (తొడ) భాగము వెనుక నుండి స్వామి వారి శరీరం నుండి విభూతి తీసి కుష్ఠ రోగం ఉన్నవారికి ప్రసాదంగా ఇస్తే, వారికి వెంటనే ఆ రోగం పోయేదని పెద్దలు చెప్తారు. అలా ఇవ్వగా ఇవ్వగా, స్వామి వారి తొడ భాగం బాగా అరిగి పోవడంతో అలా ఇవ్వడం మానేశారు. ఇప్పటికీ స్వామి వారిని వెనుక నుండి చూస్తే ఇది కనబడుతుంది అని పెద్దలు చెప్పారు. కాని భక్తులకు ఆ అవకాశం కుదరదు. ఇక్కడ స్వామి వారిని.. కులందైవళం, బాలసుబ్రహ్మణ్యన్, షణ్ముఖన్, దేవసేనాపతి, స్వామినాథన్, వల్లిమనలన్, దేవయానైమనలన్, పళనిఆండవార్, కురింజిఆండవార్, ఆరుముగన్, జ్ఞాన పండిత, శరవణన్, సేవర్ కోడియోన్, వెట్రి వేల్ మురుగా వంటి పేర్లతో పిలుస్తారు.

ఎలా వెళ్లాలి

పళని క్షేత్రం దిండుగల్‌ జిల్లాలో మదురైకు 120 కిలోమీటర్ల దూరంలో ఉంది.

విమాన మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి మదురైకి చేరుకుని అక్కడి నుంచి రోడ్డు, రైలు మార్గంలో ఆలయానికి చేరుకోవచ్చు.

రైలు మార్గం ద్వారా హైదరాబాద్‌ నుంచి చెన్నై సెంట్రల్‌, లేదా మదురై చేరుకోవాలి. మదురై నుంచి కోయంబత్తూర్‌ వెళ్లే రైళ్లు పొల్లాచ్చి మీదుగా, పళని రైల్వేస్టేషన్‌ నుంచే వెళ్తాయి. చెన్నై సెంట్రల్‌- పళని ఎక్స్‌ప్రెస్‌ తిరుచెందూర్‌ నుంచి మదురై మీదుగా పళని చేరుతుంది. అక్కడి నుంచి ఆలయం రెండు కిలోమీటర్ల దూరం ఉంటుంది. రైల్వేస్టేషన్‌ నుంచి దేవాలయానికి ఆటో, బస్సు సౌకర్యం ఉంది.

Share This Article