శ్రీ‌రామ న‌వ‌మి విశిష్ఠ‌త.. ఇలా చేస్తే అన్నీ శుభాలే

Telugu Box Office


హిందువులకు అత్యంత ముఖ్యమైన పండుగ శ్రీరామనవమి. దేశవ్యాప్తంగా ప్రజలు ఈ పండగను అత్యంత భక్తి శ్రద్దలతో జరుపుకుంటారు. శ్రీరాముడు వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి, పునర్వసు నక్షత్రపు కర్కాటక లగ్నంలో సరిగ్గా అభిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం 12 గంటల స‌మ‌యంలో త్రేతాయుగంలో జన్మించాడు. 14 సంవత్సరములు అరణ్యవాసం, రావణ సంహారం తర్వాత శ్రీరాముడు సీతాసమేతంగా అయోధ్యలో పట్టాభిషిక్తుడ‌య్యాడు. ఈ శుభ సంఘటన కూడా చైత్ర శుద్ధ నవమి నాడే జరిగిందని ప్రతీతి. సీతారాముల కళ్యాణం కూడా ఈ రోజునే జరిగింది. ఈ చైత్ర శుద్ధ నవమి నాడు భారతీయులందరూ పరమ పవిత్ర దినంగా భావించి సీతారాముల కళ్యాణ మహోత్సవాన్ని అతి వైభవంగా పట్టణాలు, పల్లెలు అన్న తేడా లేకుండా అన్నిచోట్లా రమణీయంగా జరుపుకోవడం సంప్రదాయంగా వస్తోంది.

ఖ‌మ్మం జిల్లా భద్రాచలంలో సీతారామ కళ్యాణ ఉత్సవాన్ని వైభవోపేతంగా జరుపుతారు. సీతారామ కళ్యాణం లోక జీవన హేతుకం, సకల దోష నివారణం, సర్వ సంపదలకు నిలయం, సకల జన లోక సంరక్షణమే శ్రీరామనవమి పండుగ పరమార్థం. శ్రీరాముని క్షేత్రాల్లో అత్యంత వైశిష్ట్య ప్రాధాన్యత ప్రాశస్త్యం గల క్షేత్రం.. భద్రాచలం. శ్రీ రాముడు తన వనవాస జీవితాన్ని ఇక్కడే గడపడం ఈ పుణ్య క్షేత్రం యొక్క వైశిష్ట్యం. శ్రీరామ నామము సకల పాపాలను పోగొడుతుందని సకల శాస్త్రాలూ చెబుతున్నాయి. భక్త రామదాసు చెరసాలలో ఉండిపోవ‌డంతో పూర్వం సీతారాముల కళ్యాణము మార్గశిర శుద్ధ పంచమినాడు జరిగినట్లుగా తెలుస్తోంది. అయితే తాను చెరసాల నుంచి తిరిగి వచ్చాక చైత్రశుద్ధ నవమినాడు శ్రీరామ చంద్రుని పుట్టినరోజు వేడుకలు, కళ్యాణ వేడుకలు ఒకేసారి జరిపించారు.

సీతారామ కల్యాణం జరిగిందీ, రాముడు రావణున్ని సంహరించి అయోధ్యకు తిరిగి వచ్చింది శ్రీరామనవమి నాడే. ఆ మరునాడు దశమి శ్రీరామ పట్టాభిషేకం జరిగింది. కోదండ రామ కల్యాణాన్ని చూసేందుకు మనమే కాదు సకల లోకాల దేవతలు దివి నుంచి భువికి దిగివస్తారంట.. శ్రీరామచంద్రుని దివ్య దర్శనం మహనీయంగా, నేత్ర పర్వంగా పట్టాభిషేక సమయాన తిలకించి పులకితులవుతారట. శ్రీరాముడు సత్యపాలకుడు ధర్మాచరణం తప్పనివాడు, ఏకపత్నీ వ్రతుడు, పితృ, మాతృ, భాతృ, సదాచారం, నిగ్రహం, సర్వ సద్గుణాలు మూర్త్భీవించిన దయార్ద హృదయుడు. శ్రీరామనవమి రోజున సీతారాముని, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేతముగా ఆరాధించి, వడ పప్పు, పానకము నైవేద్యముగా సమర్పించుకుంటారు.

ఇంట్లో పూజా విధానం
శ్రీరామనవమి రోజున కుటుంబ సభ్యులందరూ ఉద‌య‌మే లేచి, తలంటు స్నానం చేయాలి. శుభ్రమైన లేదా కొత్త వస్త్రములను ధరించాలి. సీతా, లక్ష్మణ, భరత, శతృఘ్న, ఆంజనేయ సమేత శ్రీరామచంద్ర మూర్తి పటమును గానీ, సీతారాముల విగ్రహాలను గానీ పూజా మందిరంలో ఉంచి శ్రీరామ అష్టోత్తర పూజ చేయాలి. నీటిలో బెల్లం, మిరియాలు, యాలకులు కలిపి పానకం తయారు చేసి, వడపప్పు(నానపెట్టిన పెసర పప్పు), పానకం నైవేద్యం పెట్టి ఆ తర్వాత ప్రసాదంగా స్వీకరించాలి. సాయంత్రం కుటుంబ సభ్యులతో కలసి ఊరిలోని రామాలయాని వెళ్లి సీతారాములను చూసి వారిని ధ్యానించుకొని ప్రసాదం స్వీకరించాలి. సీతారాముల కళ్యాణం చూసినా, జరిపించినా సర్వ శుభాలు కలుగుతాయి.

వడపప్పు, పానకమే ప్రసాదం
వినాయక ధ్యానం, సంకల్పం, పూజ చేసి దేవునికి షోడశపూజలు మాములే గనుక పూజ యధావిధిగా వాటిని ముగించి, ఆపై శ్రీరామాష్టకం, శ్రీరామ అష్టోత్తరం, జానకీ అష్టకం పఠించి పువ్వులతో పూజ చేయాలి. చైత్రమాసం మల్లెలమాసమే గనుక మల్లెపూవులతో పూజించడం శుభప్రదం. మల్లెపూవులు లభ్యంకాని ప్రాంతాలలో వుండేవారు ఏదైనా సువాసనలు గల తెల్లరంగు పూవులతో సీతాలక్ష్మామాంజనేయ సమేత శ్రీరామ పటానికి, లేదా విగ్రహానికి పూజించాలి. వడపప్పు, పానకం, రామయ్యకు ప్రీతి. అంటే స్వామి ఖరీదైన వ్యయ ప్రయాసలతో ముడిపడిన పిండివంటలేవీ కోరుకోడనీ, స్వామి సాత్వికుడనీ భక్తుల నుంచి పిండి వంటలుగాక పరిపూర్ణ భక్తి విశ్వాసాలు మాత్రమే ఆశిస్తాడ‌ని మ‌న‌కు తెలుస్తోంది.f

వడపప్పు స్నానానికి ముందుగా నానబెట్టుకోకూడదు. స్నానానంతరం మొదట వడపప్పు నానబెట్టుకొంటే, తక్కిన వంటలు పూజాదికాలు పూర్తయి, నైవేద్య సమయానికి నానుతుంది. ఆ రోజు ఏ వంట చేయాలనుకొన్నారో ఆ వంట పూర్తిచేసి అదికూడా నైవేద్యంగా పెట్టాలి. వీటితో పాటు ఏదైన ఒక ఫలం నివేదించాలి.

Share This Article
Leave a comment