దక్షిణ కాశీ వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం

Telugu Box Office

తెలంగాణలోని రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ శ్రీ రాజరాజేశ్వరస్వామి క్షేత్రం దక్షిణ కాశీగా ప్రసిద్ధి చెందింది. భక్తుల కోరికలు తీర్చే వేములవాడ రాజన్న ఆలయం ఎంతో పురాతన ప్రాశస్త్యం కలిగినది. పశ్చిమ చాళుక్యల వారికి ఈ ప్రాంతం రాజధానిగా వుండేదని పురాతత్వ ఆధారాలు తెలుపుతున్నాయి. దానిప్రకారం క్రీ.శ. 8వ శతాబ్దంలో ఈ ఆలయం నిర్మించబడినట్లు ఆధారాలున్నాయి.

ఆనాటి వేములవాడ ప్రాంతానికి మొదటి చాళిక్యరాజు అయిన నరసింహుడు రాజుగా ఉండేవారు. ఆయనకు ‘రాజాదిత్య’ అనే బిరుదు ఉండేది. ఆయన పేరు మీదుగానే ఈ ఆలయానికి రాజరాజేశ్వర ఆలయం అని పేరు వచ్చింది. చాళిక్యుల కాలంలో ఈ క్షేత్రం మహామహివాన్విత క్షేత్రం. ఈ ఆలయం చుట్టూ ఉన్న దేవాలయాలను నిర్మించడానికి సుమారు 220 సంవత్సరాల కాలం పట్టింది. ఈ ఆలయ లింగ ప్రతిష్ట వెనుక కూడా ఓ కథ ప్రాచుర్యంలో ఉంది.

పూర్వం అర్జునుడి మునిమనవడయిన నరేంద్రుడు ఒక మునిని చంపడం వల్ల అతనికి బ్రహ్మ హత్యాపాతకం కలుగుతుంది. దాని నుండి విమోచన పొందడం కోసం నరేంద్రుడు దేశాటన చేస్తూ వేములవాడ ప్రాంతానికి చేరుకున్నాడు. ఇక్కడే వున్న ధర్మగుండంలో స్నానం చేసి జపం చేస్తూ కాలాన్ని గడిపాడు. ఆవిధంగా జపం చేస్తున్న నరేంద్రునికి ఒకరోజు కొలనులో ఒక శివలింగం దొరికిందట. ఆ శివలింగాన్ని అతను ఇప్పుడున్న వేములవాడ ప్రాంతంలో ప్రతిష్టించి భక్తితో పూజించడం మొదలుపెట్టాడు. శివుడు అతడి భక్తికి మెచ్చి ప్రత్యక్షమయ్యాడు. అప్పుడు నరేంద్రుడు తనని బ్రహ్మ హత్యాపాతకం నుండి విమోచనం చేయవలసిందని కోరగా శివుడు అతడికి విముక్తి ప్రసాదిస్తాడు.

ఈ విధంగా ఏర్పడిన ఈ క్షేత్రం ‘లేంబాల వాటిక’గా, ‘భాస్కర క్షేత్రం’, ‘హరిహర క్షేత్రం’గా పిలవబడింది. ఈ రాజేశ్వర ఖండంకు సంబంధించిన కథ భవిష్కోత్తర పురాణంలో వివరంగా చెప్పబడి వుంది. శివరాత్రి పర్వదినం సందర్భంగా 100 మంది అర్చకులతో ఈ మహాలింగానికి అర్చన చేయబడుతుంది. ఇక్కడ భక్తులు నిర్వహించుకునే ప్రధాన పూజలలో కోడెముక్కు ఒకటి. ఈ పూజలో మొదటగా భక్తులు ఒక గిత్తను తీసుకుని గుడిచుట్టూ ప్రదక్షిణలు చేయిస్తారు. ఆ తరువాత ఆలయ ప్రాంగణంలో దానిని కట్టేసి, దక్షిణగా ఇచ్చేస్తారు. ఈ విధంగా ఈ పూజను నిర్వహించుకోవడం వల్ల వారికి సంతానం కలుగుతుందని భక్తులు ప్రగాఢంగా నమకం.

ఈ ఆలయంలో ఇంకొక విశిష్టమైన అంశం వుంది. ఈ ఆలయ ప్రాంగణంలో 400 సంవత్సరాలనాటి పురాతన మసీదు వుంది. పూర్వం ఇస్లాం మతానికి చెందిన ఒక శివభక్తుడు ఈ ఆలయంలోనే వుంటూ నిత్యం స్వామివారిని సేవిస్తూ ఉండేవాడట. అతని మరణం కూడా ఇక్కడే జరిగిందని చెబుతుంటారు. అలా అతని పేరు మీద ఇక్కడ మసీదును నిర్మించడం జరిగింది.

Share This Article