ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం… ఎక్కడో తెలుసా

Telugu Box Office

ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివుడి విగ్రహం రాజస్థాన్‌లో కొలువుదీరింది. రాజ్‌సమంద్‌ జిల్లా నాథ్‌ద్వారా పట్టణంలో అధునాతన హంగులతో నిర్మించిన 369 అడుగుల కైలాసనాథుడి విగ్రహాన్ని శనివారం ఆవిష్కరించారు. ‘విశ్వాస్‌ స్వరూపం’గా పేర్కొనే ఈ విగ్రహాన్ని ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త మొరారి బాపు, రాజస్థాన్‌ సీఎం అశోక్‌ గహ్లోత్‌ ప్రారంభించారు. ప్రపంచంలోనే ఎత్తైనదిగా పేర్కొనే ఈ విగ్రహం విశేషాలేంటో చూద్దామా..!

ప్రపంచంలోనే ఎత్తైన 369 అడుగుల విగ్రహాన్ని ఉదయ్‌పూర్‌కు 45కి.మీల దూరంలో తత్‌ పదమ్‌ సంస్థాన్‌ అనే సంస్థ నిర్మించింది. దాదాపు 32 ఎకరాల విస్తీర్ణ భూభాగంలో ఓ కొండపై ఏర్పాటు చేసిన శివుడి విగ్రహం దర్శనం ఇస్తుంది. 20 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ఇది కనిపిస్తుంది. శివుడి విగ్రహాన్ని నిర్మించేందుకు మూడు వేల టన్నుల స్టీల్‌ వినియోగించారు. అలాగే, 2.5లక్షల క్యూబిక్‌ టన్నుల కాంక్రీట్‌, ఇసుకను వాడారు.

ఈ భారీ విగ్రహాన్ని నిర్మించేందుకు పదేళ్ల సమయం పట్టింది. 2012 ఆగస్టులో ఈ ప్రాజెక్టకు శంకుస్థాపన జరిగింది. అప్పట్లోనూ సీఎంగా ఉన్న అశోక్‌ గహ్లోత్‌, మొరారి బాపు ఆధ్వర్యంలోనే భూమి పూజ నిర్వహించారు. ప్రపంచంలోనే ఇది అతి ఎత్తైన శివుడి విగ్రహం. లోపలికి వెళ్లేందుకు వీలుగా లిఫ్టులు, మెట్లు, భక్తుల కోసం ప్రత్యేకంగా హాలు నిర్మించారు. ఇందులో నాలుగు లిఫ్టులు, మూడు మెట్ల మార్గాలు ఉన్నాయి. ఇక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్‌ కాంతుల్లో రాత్రి పూట కూడా శివుడి విగ్రహం దేదీప్యమానంగా వెలుగుతూ స్పష్టంగా కనిపిస్తుందని మాలి పేర్కొన్నారు. 250కి.మీల వేగంతో వీచిన గాలినైనా తట్టుకొగలిగే సామర్థ్యంతో నిర్మించారు. ఈ విగ్రహానికి విండ్‌ టన్నెల్‌ పరీక్ష ఆస్ట్రేలియాలో నిర్వహించారు.

ఈ పర్యాటక ప్రాంతానికి విచ్చేసిన పర్యాటకులకు ఆహ్లాదకరంగా ఉండేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. బంగీ జంపింగ్‌, జిప్‌ లైన్‌, గో కార్ట్‌, ఫుడ్‌ కోర్టులు, అడ్వెంచర్‌ పార్కు, జంగిల్‌ కేఫ్‌ వంటివి ఉన్నాయి. శనివారం శివుడి విగ్రహం ఆవిష్కరణ తర్వాత తొమ్మిది రోజులు (అక్టోబర్‌ 29 నుంచి నవంబర్‌ 6 వరకు) పలు ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు.

Share This Article