భారతదేశపు చిట్టచివరి గ్రామం ‘మనా’.. ఎన్నో విశేషాల సమాహారం

Telugu Box Office

ఉత్తరాఖండ్ లోని ‘మనా’ గ్రామం.. హిమాచల్ ప్రదేశ్‌లోని చిట్కుల్ గ్రామం… వీటిలో ఏది భారతదేశపు చిట్టచివరి గ్రామంగా పరిగణించబడుతుందనే విషయంలో చాలా మంది గందరగోళపడుతుంటారు. ప్రాధమికంగా చిట్కుల్ అనేది ఇండో – టిబెటన్ సరిహద్దులో ఉన్న జనావాస గ్రామం. అయితే ఉత్తరాఖండ్ లోని ‘మనా’ మాత్రం భారతదేశం యొక్క చిట్టచివరి గ్రామంగా అధికారికంగా గుర్తింపు పొందింది.

ఉత్తరాఖండ్ లోని చమోలి జిల్లాలో సముద్రమట్టానికి 3200 మీటర్ల ఎత్తులో ‘మనా’ గ్రామం ఉంది. ప్రముఖ హిందూ తీర్ధయాత్ర స్థలం బద్రీనాథ్ నుంచి 5 కిలోమీటర్ల దూరంలో సరస్వతి నదీ పరివాహిక ప్రాంతంలో ఈ గ్రామం కనిపిస్తుంది. ఈ అందమైన కుగ్రామం ఇండో – చైనా సరిహద్దు నుంచి 24 కిలోమీటర్ల దూరంలో ఉండడంతో ఇది భారతదేశపు చిట్టచివరి గ్రామంగా పేరుగాంచింది. మీరు ఈ ప్రాంతాన్ని ఎప్పుడైనా సందర్శిస్తే అక్కడ దుకాణదారులను, వారు విక్రయించే సామాగ్రిని జాగ్రత్తగా పరిశీలించండి. వాటిపై ‘చివరి గ్రామం’, ‘ఇండియా చివరి టీ , కాఫీ కార్నర్’ అనే వివిధ ముద్రణలు కనిపిస్తాయి. ఇవి చాలా ఆసక్తికరంగా ఉంటాయి. ‘మనా’ గ్రామం హిందువులకు ఎంతో మతపరమైన ప్రాముఖ్యత కలిగిన ప్రదేశం.

ఈ గ్రామాన్ని మహాభారత కాలానికి సంబంధించినదిగా చెబుతారు. పాండవులు స్వర్గానికి తమ చివరి ప్రయాణం చేసినప్పుడు ‘మనా’ గ్రామం గుండా వెళ్లారని నమ్ముతారు. ఈ ప్రాంతంలో సరస్వతి నదికి సమీపంలో ఓ రాతి వంతెన ఉంటుంది. దీనిని ‘భీమా పుల్’ అని కూడా పిలుస్తారు. పాండవ సోదరుల్లో ఒకరైన భీముడు దీన్ని నిర్మించినట్లు కధనం ప్రచారంలో ఉంది. మనా గ్రామంలో చూడాల్సిన ఆసక్తికర ప్రదేశాలు ఎన్నో ఉన్నాయి. వీటి గురించి తప్పకుండా తెలుసుకోవాలి.

నీలకంత్ శిఖరం
సముద్ర మట్టానికి 6597 అడుగుల ఎత్తులో ఉండే నీలకంత్ శిఖరం ఈ ప్రాంతంలోని ప్రధాన పర్యాటక ఆకర్షణల్లో ఒకటి. దీనిని ‘క్వీన్ ఆఫ్ గర్హ్వాల్’ అని కూడా పిలుస్తారు. బద్రీనాథ్ ఆలయానికి చేరువలో మంచుతో కప్పబడి ఉండే ఈ అందమైన పర్వత శిఖరం సాహసికులు, పర్వతారోహణ పట్ల ఆసక్తి గల వారు తప్పక సందర్శించాల్సిన ప్రదేశం.

తప్త్ కుండ్
హిందూ పురాణాల ప్రకారం తప్త్ కుండ్ ను అగ్ని యొక్క పవిత్ర నివాసంగా చెబుతారు. ఇక్కడ ఎంతో విలువైన ఔషధ సంపద ఉన్నట్లు నమ్ముతారు.ఈ కుండ్ నీటిలో మునక వేస్తే చర్మ వ్యాధులు నయం అవుతాయని భక్తుల విశ్వాసం.

వసుధార
ఈ ప్రాంతంలోని అద్భుతమైన ప్రదేశాల్లో వసుధార ఒకటి. బద్రీనాథ్ ఆలయం నుంచి 9 కిలోమీటర్ల దూరంలో ఈ అందమైన జలపాతాలు ఉన్నాయి. పురాణాల ప్రకారం పాండవులు అజ్ఞాతవాసంలో ఉన్నప్పుడు కొంతకాలం ఇక్కడ నివసించారట.

వ్యాస గుహ
మహాభారతం వంటి గొప్ప ఇతిహాసాన్ని రచించిన వేదవ్యాసుడు ఈ గుహ లోపలే ప్రఖ్యాత నాలుగు వేదాలను రచించినట్లు చారిత్రక కధనం. ఈ గుహలో చిన్న మందిరం ఎంతో ఆసక్తికరంగా ఉంటుంది. వేద వ్యాసునికి అంకితం చేయబడిన ఈ మందిరం దాదాపు 5000 ఏళ్ల క్రితం నాటిదని నమ్ముతారు.

భీమా పుల్
మనా గ్రామంలోని ప్రధాన ఆకర్షణల్లో భీమా పుల్ ఒకటి. పాండవులు స్వర్గానికి ప్రయాణం చేస్తున్న సమయంలో తన భార్య ద్రౌపతి సరస్వతి నదిని దాటెందుకు వీలుగా భీముడు ఈ రాతి వంతెనను నిర్మించినట్లు చెబుతారు. సాహసాల పట్ల ఆసక్తి గల వారికి ఈ గ్రామం ఎన్నో ఆసక్తికరమైన కార్యకలాపాలను అందిస్తుంది. భారతదేశంలో పర్వతారోహణకు అనువైన ఉత్తమమైన ప్రదేశాల్లో ఒకటిగా ఈ ప్రాంతాన్ని పరిగణిస్తారు. మనా నుంచి వసుంధర, మనా నుంచి మనా పాస్, మనా నుంచి చరణపాదుక వరకూ ఇతరులతో కలిసి నడక సాగించడం ఓ గొప్ప అనుభవంగా చెప్పవచ్చు.

​ఎలా వెళ్లాలి
ఉత్తరాఖండ్‌లోని మనాకు రిషికేష్, హరిద్వార్ నుంచి సులభంగా చేరుకోవచ్చు. బద్రీనాథ్ నుంచి ఇక్కడికి కేవలం 5 కిలోమీటర్లు మాత్రమే. హరిద్వార్ ఇక్కడికి సమీప రైల్వే స్టేషన్. ఈ స్టేషన్ నుంచి మనా గ్రామానికి 275 కిలోమీటర్ల దూరం ఉంటుంది. బస్సు లేదా ట్యాక్సీ ద్వారా చేరుకోవచ్చు. డెహ్రాడూన్ నుంచి మనాకు 315 కిలోమీటర్లు. రైల్వేస్టేషన్ బయట నుంచి తరచుగా బస్సులు అందుబాటులో ఉంటాయి.

Share This Article