రివ్యూ: రంగ రంగ వైభవంగా

Telugu Box Office

చిత్రం: రంగ రంగ వైభ‌వంగా; న‌టీన‌టులు: వైష్ణవ్ తేజ్‌, కేతికా శ‌ర్మ‌, న‌వీన్ చంద్ర‌, న‌రేశ్‌, ప్రభు, తుల‌సి, ప్రగ‌తి, సుబ్బరాజు, అలీ, రాజ్‌కుమార్ క‌సిరెడ్డి, హ‌ర్షిణి త‌దిత‌రులు; సంగీతం: దేవిశ్రీ ప్రసాద్‌; కూర్పు: కోట‌గిరి వెంక‌టేశ్వర‌రావు; ఛాయాగ్రహ‌ణం: శ్యామ్‌ద‌త్ సైనుద్దీన్‌; నిర్మాత‌: బివిఎస్ఎన్ ప్రసాద్‌; క‌థ‌, స్ర్కీన్‌ప్లే, ద‌ర్శక‌త్వం: గిరీశాయ‌; విడుద‌ల తేదీ: 02-09-2022

వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) ‘ఉప్పెన’ (Uppena) అనే సినిమాతో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. చిరంజీవి (Chiranjeevi) మేనల్లుడుగా.. మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకున్నాడు. వైష్ణవ్ తేజ్ రెండో సినిమా ‘కొండపొలం’ (Kondapolam) సరిగా ఆడకపోయినా.. నటుడిగా అతనికి మంచి పేరు వచ్చింది. ఇప్పుడు మూడో సినిమా – ‘రంగ రంగ వైభవంగా’ (Ranga Ranga Vaibhavanga) విడుదలైంది. చినమామయ్య పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పుట్టినరోజు నాడు ఈ సినిమా విడుదలవడం వైష్ణవ్ తేజ్‌కి ప్లస్ పాయింట్‌గా భావించారు. దీనికి సంగీతం దేవి శ్రీ ప్రసాద్ (Devi Sri Prasad) ఇచ్చారు ఈ సినిమాలో కేతిక శర్మ (Ketika Sharma) కథానాయికగా చేసింది. ఈ ‘రంగ రంగ వైభవంగా’ సినిమా ఎలా ఉందో చూద్దాం..

స్నేహానికి నిలువెత్తు నిద‌ర్శనం రాముడు (ప్రభు), చంటి (న‌రేష్‌). ఇద్దరివీ ప‌క్క ప‌క్క ఇళ్లే. చంటి కొడుకు రిషి (వైష్ణవ్ తేజ్‌), రాముడు కూతురు రాధ (కేతికా శ‌ర్మ‌).. ఇద్దరూ ఒకే రోజున‌.. ఒకే ఆస్పత్రిలో జ‌న్మిస్తారు. ఈ త‌ల్లిదండ్రుల‌ మ‌ధ్య ఉన్న చ‌క్కటి స్నేహ బంధ‌మే పిల్లల మ‌ధ్య మొగ్గ తొడుగుతుంది. అయితే రిషి, రాధ‌ స్నేహం స్కూల్ డేస్‌లోనే ప్రేమ బంధంగా మారుతుంది. స్కూల్‌లో జ‌రిగిన ఓ చిన్న సంఘ‌ట‌న వీరిద్దరి మ‌ధ్య దూరం పెంచుతుంది. ఇగోతో పంతాల‌కు పోయి ఒక‌రితో మ‌రొక‌రు మాట్లాడుకోవ‌డం మానేస్తారు. ఇద్దరూ ఒకే మెడిక‌ల్ కాలేజీలో చ‌దువుతున్నా.. ఒక‌రితో ఒక‌రు ఒక్క మాట కూడా మాట్లాడుకోరు. కానీ, ఇద్దరికీ ఒక‌రంటే మ‌రొక‌రికి చ‌చ్చేంత ప్రేమ. ఈ జంట మ‌ధ్యనున్న ఇగో వార్ చ‌ల్లారి.. ఒక్కట‌య్యే స‌మ‌యంలోనే వీరి కుటుంబాల్లో మ‌రో ప్రేమ‌క‌థ అలజ‌డి రేపుతుంది. అది రిషి అన్నయ్య‌.. రాధ అక్క ప్రేమ‌క‌థ‌. వీరి వ‌ల్ల రిషి – రాధ‌ ప్రేమ ఎందుకు స‌మ‌స్యల్లో ప‌డింది? ప్రాణ స్నేహితులుగా ఉన్న కుటుంబాల మ‌ధ్య గొడ‌వ‌లు మొద‌ల‌వ‌డానికి కార‌ణ‌మేంటి? ఇందులో రాధ అన్నయ్య వంశీ (న‌వీన్ చంద్ర‌) పాత్ర ఏంటి? ఈ రెండు ప్రేమ‌క‌థ‌లు ఎలా సుఖాంత‌మ‌య్యాయి? రెండు కుటుంబాల్ని ఒక్కటి చేయ‌డానికి రిషి చేసిన సాహ‌సాలేంటి? అన్నది మిగిలిన క‌థ‌.

ఈ సినిమాతో గిరీశాయ (Gireesaaya) అనే కొత్త దర్శకుడు పరిచయమయ్యాడు. కథ, స్ర్కీన్‌ప్లే కూడా ఆయనే అందించాడు. కానీ ఒక పాత కథను తీసుకొని కొంచెం అటు ఇటు మార్చడం తప్ప గిరీశాయ చేసిందేమీ లేదు. అలాగే దర్శకుడిగా సినిమాని ఆసక్తికరంగానూ చిత్రీకరించలేకపోయాడు, ఎందుకంటే కథలో పట్టులేదు కాబట్టి. ప్రేక్షకులకి రాబోయే సన్నివేశాలు ఏ విధంగా వుంటాయో, ఏమి జరగబోతుందో అనేది ముందే తెలిసిపోతుంది. ఎక్కడా కూడా కొత్తదనం కనిపించదు. ‘కంటెంట్ బాగుండాలి…’ అని అంటూ ఉంటారు కదా, మరి ఒక సీనియర్ నిర్మాత అయిన బివిఎస్ఎన్ ప్రసాద్ ఈ కథని ఎలా అంగీకరించారో ఆయనకే తెలియాలి. అందుకని కాబోలు ఆయన ఈ చిత్రానికి సంబంధించిన ప్రమోషన్స్ మీద కూడా పెద్దగా దృష్టి పెట్టలేదు. (Ranga Ranga Vaibhavanga Review)

ఎవ‌రెలా చేశారంటే: రిషి పాత్రలో వైష్ణవ్ స్టైలిష్ లుక్‌తో ఆక‌ట్టుకునేలా క‌నిపించారు. కొన్ని స‌న్నివేశాల్లో ఆయ‌న న‌ట‌న‌, ప‌లికించిన హావ‌భావాలు ప‌వ‌న్ క‌ల్యాణ్‌ను గుర్తు చేస్తాయి. అయితే క‌థ‌లోనే స‌రైన బ‌లం లేక‌పోవ‌డంతో న‌ట‌న ప‌రంగా ఆయ‌న కొత్తగా చేయడానికి అవ‌కాశం దొర‌క‌లేదు. వైష్ణవ్‌కు జోడీగా కేతిక అంద‌చందాల‌తో ఆక‌ట్టుకునే ప్రయ‌త్నం చేసింది. ఇద్దరి మ‌ధ్య కెమిస్ట్రీ చ‌క్కగా కుదిరింది. న‌వీన్ చంద్ర‌, ప్రభు, న‌రేశ్ త‌దిత‌రులు పాత్రల ప‌రిధి మేరకు నటించారు. ద‌ర్శకుడు క‌థ రాసుకున్న విధానం.. దాన్ని తెర‌పై ఆవిష్కరించిన తీరు ఏమాత్రం ప్రేక్షకుల్ని మెప్పించ‌దు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకి కాస్త బ‌లాన్నిచ్చింది. మూడు పాట‌లు విన‌సొంపుగా ఉన్నాయి. శ్యామ్ ద‌త్ ఛాయాగ్రహ‌ణం ఆక‌ట్టుకుంటుంది. నిర్మాణ విలువ‌లు ఉన్నతంగా ఉన్నాయి.

Share This Article