శివశంకర్ మాస్టర్ కన్నుమూత

Telugu Box Office

టాలీవుడ్‌లో మరో విషాదం చోటుచేసుకుంది. ప్రముఖ నృత్య దర్శకుడు శివశంకర్ మాస్టర్ (72) కన్నుమూశారు. కరోనాతో చికిత్స పొందుతూ ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుది శ్వాస విడిచారు. ఇటీవల శివశంకర్ మాస్టర్ కుటుంబం వైరస్‌ మహమ్మారి బారిన పడింది. ప్రస్తుతం శివశంకర్ పెద్ద కుమారుడు విజయ్ శివశంకర్ కరోనాతో పోరాడుతున్నారు. వారి కుటుంబ చికిత్స కోసం మాస్టర్ చిన్న కుమారుడు అజయ్‌ విరాళాలు సేకరించిన సంగతి తెలిసిందే.

గత కొన్ని రోజులుగా ఆయన ఆరోగ్యం గురించి టాలీవుడ్ ప్రముఖులు ఆరా తీస్తున్నారు. ఆయన పరిస్థితి చూసి చలించిపోయిన మెగాస్టార్ చిరంజీవి వైద్యం నిమిత్తం మూడు లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. రియల్ హీరో సోనూ సూద్ సైతం శివ శంకర్ మాస్టర్ పరిస్థితిపై ఆరా తీశారు. మంచు విష్ణు మా అధ్యక్షుడి హోదాలో హాస్పిటల్ బృందంతో మాట్లాడాడు. ఇక వీరందరికంటే ముందుగానే హీరో ధనుష్ ఎవ్వరికీ తెలియకుండా ఐదు లక్షల ఆర్థిక సాయాన్ని కూడా చేశారట. కానీ ఇవేవీ కూడా శివ శంకర్ మాస్టర్ ప్రాణాలను కాపాడలేకపోయాయి.

డిసెంబర్ 7, 1948న చెన్నైలో పుట్టిన శివశంకర్ మాస్టర్‌ జన్మించారు. శివశంకర్ తండ్రి కళ్యాణ సుందరం పండ్ల వ్యాపారి కాగా 1974లో మాస్టర్ సలీమ్ వద్ద సహాయ నృత్యదర్శకుడిగా శివశంకర్ మాస్టర్‌ పనిచేశారు. తర్వాత భారతీయ చిత్ర పరిశ్రమలోని 10 భాషల్లో చిత్రాలకు నృత్యరీతులు సమకూర్చారు. 800 చిత్రాలకుపైగా డ్యాన్స్ మాస్టర్‌గా పనిచేసిన శివశంకర్ సుమారు 30 సినిమాల్లో నటించారు. 2011లో దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన ‘మగధీర’ చిత్రానికి జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు. అమ్మోరు, సూర్యవంశం, అల్లరి పిడుగు, మగధీర, అరుంధతి, మహాత్మా, బాహుబలి ది బిగినింగ్ చిత్రాలకు శివశంకర్ మాస్టర్‌ కొరియోగ్రఫీ అందించారు.

Share This Article