60 వసంతాల ‘గుండమ్మ కథ’.. తెరవెనుక ఎన్నో ఆసక్తికర విశేషాలు

Telugu Box Office

విజయా సంస్థ నిర్మించిన చిత్రాల్లో ఆఖరి విజయవంతమైన చిత్రం ‘గుండమ్మ కథ’. అప్పటిలో ఇది అగ్రశ్రేణి నటులతో నిర్మించిన మల్టీ స్టారర్. కాని “గుండమ్మ కథ” అని సూర్యకాంతం పాత్ర పేరుమీద సినిమా పేరు పెట్టడమే గొప్ప వైవిధ్యం. హాస్యం, సంగీతం ఈ చిత్రానికి అద్భుత విజయాన్ని సమకూర్చాయి. జానపద బ్రహ్మగా పేరొందిన విఠలాచార్య కన్నడంలో మనె తుంబిద హెణ్ణు పేరిట కుటుంబ కథాచిత్రాన్ని తెరకెక్కించారు. చిత్ర నిర్మాణానికి విఠలాచార్య నిర్మాత, వాహినీ స్టూడియోస్ అధినేత బి.నాగిరెడ్డి సహకారం పొందారు. ఆ కృతజ్ఞతతో నాగిరెడ్డి అడగగానే సినిమా హక్కుల్ని విఠలాచార్య ఆయనకి ఇచ్చేశారు.
మనె తుంబిద హెణ్ణు సినిమాలో గుండమ్మ అనే గయ్యాళికి, నోరుమెదపలేని భర్త ఉంటాడు. ఆమె తన సవతి కూతురుని ఓ పిచ్చివాడికి ఇచ్చి పెళ్ళిచేస్తుంది. ఆ విషయం తెలిసిన సవతి కూతురు మేనమామ గుండమ్మపై పగబడతాడు. అతను గుండమ్మ స్వంత కూతురికి నేరాలకు అలవాటుపడ్డ జైలుపక్షికి ఇచ్చి పెళ్ళిజరిగేలా పథకం ప్రకారం చేయిస్తాడు. ఇలా సాగుతుంది ఆ సినిమా. అయితే ఇందులో గుండమ్మ కుటుంబ వ్యవహారాలు నాటకీయంగా సాగుతూ, నాగిరెడ్డికి చాలా తమాషాగా అనిపించాయి. దాంతో విజయా ప్రొడక్షన్స్ చరిత్రలోనే తొలిసారి ఓ రీమేక్ చేసేందుకు సిద్ధపడ్డారు.

కథలో చిన్న చిన్న మార్పులు చేసి డి.వి.నరసరాజుతో మాటలు రాయించేశారు నాగిరెడ్డి. సినిమాకు దర్శకునిగా నాగిరెడ్డి సోదరుడు బి.ఎన్.రెడ్డిని అనుకున్నారు. అయితే బి.ఎన్.రెడ్డి కళాత్మక చిత్రాల తరహా దర్శకుడు కావడమూ, ఇది ఆయన తరహా సినిమా కాకపోవడంతో పాటు బి.ఎన్.రెడ్డి లాంటి అగ్ర దర్శకుడు ఓ రీమేక్ సినిమా చేస్తే బాగోదన్న అనుమానం రావడంతో నాగిరెడ్డే వేరే దర్శకునితో చేద్దామని నిర్ణయించుకున్నారు. పి.పుల్లయ్య దర్శకత్వం వహిస్తే బావుంటుందని, ఆయనకు నరసరాజు సిద్ధం చేసిన డైలాగ్ వెర్షన్ ఆయనకు పంపారు. అది చదివిన పుల్లయ్య ఈ కథ, ట్రీట్మెంట్ నాకు నచ్చలేదు అని ప్రాజెక్టు నుంచి తప్పుకున్నారు. దాంతో సినిమా నిర్మాణం మళ్ళీ వెనుకబడింది. ఈ స్క్రిప్ట్ తన సన్నిహితుడు, సహ నిర్మాత, రచయిత అయిన చక్రపాణికి ఇచ్చారు నాగిరెడ్డి. చక్రపాణికి వికలాంగులు, పిచ్చివాళ్ళతో హాస్యం చేస్తూ సీన్లు నడపడం అంతగా నచ్చదు. దాంతో హీరో పిచ్చివాడు కావడమే ప్రధానమైన పాయింట్ అయిన ఈ సినిమా స్క్రిప్ట్ ఆయనకు నచ్చలేదు. కానీ గుండమ్మ కుటుంబ వ్యవహారాలు, ఆ పాత్రలు బాగా నచ్చిన నాగిరెడ్డి మాత్రం ఎలాగైనా సినిమా తీయాల్సిందేనన్న పట్టుదలతో ఉన్నారు. దాంతో చక్రపాణి మొత్తం స్క్రిప్టును తిరగరాసే పనిలో పడ్డారు. విలియం షేక్‌స్పియర్ రాసిన ద టేమింగ్ ఆఫ్ ద ష్రూ నాటకంలో కథానాయికల పాత్రలను, వారి స్వభావాలను ఆధారం చేసుకుని చక్రపాణి కథను తిరగరాశారు.

సినిమాకు దర్శకునిగా చివరకు కమలాకర కామేశ్వరరావుని ఎంచుకున్నారు నాగిరెడ్డి. తర్వాత చక్రపాణి తిరగరాసిన కథకు ట్రీట్మెంట్, సీనిక్ ఆర్డర్ కోసం కథాచర్చలకు చక్రపాణితో, కమలాకర కామేశ్వరరావు, డి.వి.నరసరాజు కూర్చున్నారు. ఆ చర్చల్లో భాగంగా అప్పటివరకూ ఉన్న గుండమ్మ భర్త పాత్రను తీసేసి గుండమ్మను వైధవ్యం అనుభవిస్తున్నదానిగా చూపిద్దామని నిర్ణయించారు చక్రపాణి. అయితే కళకళలాడుతూ, నగలతో పసుపుకుంకుమలతో గుండమ్మను చూపిద్దామనుకున్న దర్శకుడు కామేశ్వరరావు ఆశాభంగం చెందారు. కానీ చక్రపాణి స్క్రిప్ట్ రచయితగా కథకు ఉపయోగపడని, కథలో మలుపులకు కారణం కాని పాత్ర వ్యర్థమన్న దృష్టితో “పెళ్ళానికి సమాధానం చెప్పలేని వాడు ఉన్నా ఒకటే, లేకపోయినా ఒకటే. ఆ పాత్ర మన కథకు అనవసరం” అంటూ తేల్చి, పాత్రను తొలగించేశారు. అయితే మిగతా గుండమ్మ కుటుంబాన్నంతా యధాతథంగా తీసుకున్నారు.

సినిమా కథని చక్రపాణి తిరగరాసిన తర్వాత మాటల రచయిత నరసరాజు, దర్శకుడు కామేశ్వరరావు, స్క్రీన్ ప్లే రచయిత చక్రపాణిల మధ్య జరిగిన కథాచర్చల్లో నటీనటుల ఎంపిక జరిగింది. ఆ చర్చల్లోనే వెంటనే ఎన్.టి.రామారావు, అక్కినేని నాగేశ్వరరావులను తీసుకుందామని నిర్ణయించుకున్నారు. సినిమా అనుకున్ననాడే గుండమ్మ పాత్రకు సూర్యకాంతం అయితేనే సరిపోతారని భావించారు. గుండమ్మ నిజానికి తెలుగుపేరు కాదు కన్నడపేరు. కన్నడంలోని ఈ సినిమా మాతృకలో ఓ పాత్ర పేరు గుండమ్మ. కథను తిరగరాసే క్రమంలో ఆ గుండమ్మ పాత్రను ప్రధానపాత్రగా చేసుకున్నారు. ఆ పాత్రకు ఏ పేరుపెట్టాలా అని తర్జనభర్జనలు పడుతుంటే, మరో పేరు ఎందుకు గుండమ్మ అన్న పేరే పెట్టేద్దామని నిర్ణయించారు చక్రపాణి. అంత కీలకమైన పాత్రకి పెట్టే పేరు తెలుగుపేరు కాకపోవడమా అన్న సందేహాన్ని చిత్రబృందం వ్యక్తం చేస్తే, “ఇందులో ఏముంది, పెడితే అదే తెలుగు పేరు అవుతుంది” అని కొట్టిపారేసి గుండమ్మ అన్న పేరు ఖాయం చేసేశారు.

సినిమాలో నటించిన ఇద్దరు కథానాయకులు ఎన్టీఆర్, ఏఎన్నార్ అప్పటికే తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోలు. సినిమా విడుదల సమయంలో టైటిల్స్ లో ఎవరి పేరు ముందువేయాలి, ఎవరి పేరు తర్వాత వేయాలి వంటి సందేహాలు వచ్చాయి. అయితే దీన్ని పరిష్కరించేందుకు అసలు తెరపై పేర్లే వేయకుండా ఫోటోలు చూపించాలని నిర్ణయించుకున్నారు. మొదట ఎన్టీ రామారావు, నాగేశ్వరరావు, సావిత్రి, జమున, ఎస్వీ రంగారావుల ఫోటోలు ఒకేసారి తెరపై వేసి, తర్వాత ఒకేసారి సూర్యకాంతం, ఛాయాదేవి, రమణారెడ్డి, హరనాథ్, ఎల్.విజయలక్ష్మిల ఫోటోలు వేశారు. గుండమ్మ కథ సినిమాని విజయా నిర్మాతలకు చెందిన వాహినీ స్టూడియోస్ లో నిర్మించారు. సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఫొటోగ్రఫీగా మార్కస్ బార్ట్లే వ్యవహరించారు. చిత్రీకరణలో అవసరమైన సెట్ లను కళాదర్శకులుగా వ్యవహరించిన గోఖలే, కళాధర్ వేశారు. మేకప్ ఎం.పీతాంబరం, టి.పి.భక్తవత్సలం వేశారు.

సినిమాలో ముఖ్యపాత్రలు చేసిన ఎన్టీ రామారావు, అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి, ఎస్.వి. రంగారావు, సూర్యకాంతం తదితరులు పరిశ్రమలో చాలా బిజీ ఆర్టిస్టులు. వీళ్ళందరిపై ఒకేసారి షూటింగ్ చేయాలంటే వాళ్ళ డేట్స్ కలిసేవి కాదు. కాల్షీట్ సమస్య వల్ల అలాంటి సన్నివేశాల వరకూ అలా కుదిరిన కొన్ని డేట్లలో తీసి మిగతా సినిమాను వేరే పద్ధతిలో తెరకెక్కించారు. ఏ షాట్, ఎవరెవరి కాంబినేషన్లో షాట్ తీయాలన్నా సమస్య లేకుండా బౌండ్ స్క్రిప్ట్ సిద్ధంగా పెట్టుకున్నారు. విజయా వారికి చెందిన వాహినీ స్టూడియోలో గుండమ్మ ఇంటి సెట్ వేసివుంచారు. రోజూ ఉదయం చక్రపాణి ఆఫీసుకు వచ్చేసి రామారావు, సావిత్రి, నాగేశ్వరరావు, ఎస్వీఆర్ మొదలై నటులకు ఫోన్ చేసేవారు. ఫోన్లో ఆరోజు వాళ్ళ షెడ్యూల్ ఏంటో కనుక్కునేవారు. ఒకవేళ ఎవరైనా ఈరోజు షూటింగ్ కి వెళ్ళాలి అంటే సరేనని తర్వాతి రెండ్రోజుల సంగతి తెలుసుకుని ఫోన్ పెట్టేసేవారు. మరెవరైనా ఆ రోజు ఖాళీగా ఉన్నానంటే పిలిపించేవారు. వచ్చినవాళ్ళలో స్క్రిప్ట్ ని బట్టి వాళ్ళ మధ్య కాంబినేషన్ సీన్లు చూసుకుని వాళ్ళతో షూటింగ్ చేసేవారు. సినిమాలో “కోలో కోలోయన్న” పాట ఎన్టీఆర్-సావిత్రి, ఏఎన్నార్-జమున జంటలు పక్కపక్కనే ఉండి పాడుకుంటున్నట్టు చూపించారు. కానీ నలుగురు ఒకేసారి కలిసి చేయనేలేదు. ఎవరికి ఎప్పుడు ఖాళీవుంటే వారితో అప్పుడు పాటను తీసేశారు. ఎడిటింగ్‌లో ఆ తేడాలు తెలియకుండా జాగ్రత్తపడ్డారు.

సినిమాకు డైరెక్టర్ ఆఫ్ ఆడియోగ్రఫీగా ఎ.కృష్ణన్, సౌండ్ ఇంజనీర్ గా వి.శివరాం వ్యవహరించారు. గుండమ్మకథను జి.కళ్యాణసుందరం ఎడిటింగ్ చేయగా ఆయనకు సహాయకునిగా డి.జి.జయరాం వ్యవహరించారు. సినిమా రీల్ ని విజయా లేబొరేటరీస్ లో ప్రాసెస్ చేశారు. సినిమాలో పలు సన్నివేశాల్లో నటించిన నటులంతా లేకున్నా దొరికిన వారితో దొరికినట్టుగా తీసేశారు. దాంతో ఆ తేడా తెలియకుండా ఎడిటింగ్ లో జాగ్రత్తలు తీసుకున్నారు. గుండమ్మకథ సినిమా జూన్ 7, 1962న రాష్ట్రవ్యాప్తంగా విడుదలైంది.



సినిమా విడుదలకు ముందే విమర్శలు చెలరేగాయి. సినిమా రిలీజ్ కి ఇంకా పదిరోజుల సమయం ఉందనగానే, ఎల్వీ ప్రసాద్ ఇంట్లో జరిగిన పెళ్ళివేడుకల్లో గుండమ్మ కథ సినిమాను ప్రదర్శించారు. సినిమా చూసిన సినిమా వర్గాలు సినిమాలో కథే లేదని, సూర్యకాంతం గయ్యాళితనాన్ని సరిగా ఎస్టాబ్లిష్ చేయలేదని విమర్శలు ప్రచారం చేశారు. హరనాథ్-విజయలక్ష్మి చేసిన పాత్రలు అనవసరమని, జమున పాత్ర చిత్రణ సరిగా లేదని మరికొందరు విమర్శించారు. చివరికి విజయా వారి నిర్మాణంలో మాయాబజార్ సహా పలు చిత్రాలు తీసిన దర్శకుడు కె.వి.రెడ్డి సినిమా బాగోలేదని అన్నారు. ప్రివ్యూ తర్వాత నరసరాజుకు తన అభిప్రాయాన్ని చెప్తూ “అదేం కథండీ! కృష్ణా, గుంటూరు జిల్లాల సంపన్న వర్గాల కథలా వుంది. చక్రపాణి గారే రాయగలరు అలాంటి కథలు. మీరు రాసిన డైలాగులు బాగున్నాయనుకోండి. ఒక్క డైలాగులతోనే పిక్చర్ నడుస్తూందా” అన్నారు. సినిమా విడుదలై హౌస్ ఫుల్ కలెక్షన్లతో నడుస్తున్నప్పుడు- విజయా వారి సినిమా, పెద్ద నటీనటులు నటించారు. మొదట్లో హౌస్ ఫుల్ అవుతాయి. పోగాపోగా చూద్దాం అనేవారు. సినిమా ఘన విజయమని స్థిరపడిపోయాకా కూడా ఆయన సమాధాన పడలేదు, ఏంటోనండి. జనం ఎందుకు చూస్తున్నారో అర్థంకావట్లేదు అంటూ గుండమ్మకథ ప్రస్తావన వచ్చినపపుడల్లా అనేవారు.
.
సినిమా విడుదల ముందు విమర్శలు రావడంతో విడుదల సమయంలో చిత్రవర్గాలు ఉత్కంఠతో ఎదురుచూశారు. గుండమ్మ కథ ప్రివ్యూ చూసినప్పుడు ఎన్టీఆర్ నిక్కర్లో తెరపై కనిపించగానే ప్రివ్యూ చూస్తున్న చిన్నపిల్లలంతా ఒక్కపెట్టున నవ్వారు. అది చూసిన చక్రపాణి ఆ అంచనాతోనే ప్రివ్యూ అవగానే “ఎవరెన్ని అనుకున్నా సినిమా సూపర్ హిట్” అని తేల్చేశారు. ఆయన అంచనాలు నిజం చేస్తూ సినిమా అప్రతిహత విజయాలను సాధించింది.

TAGGED: , , ,
Share This Article