జంబుకేశ్వరం !

Telugu Box Office

పంచభూత క్షేత్రాలలొ రెండవది జంబుకేశ్వరం. జంబుకేశ్వరం తమిళనాడు రాహ్స్ట్రములొని తిరుచ్చికి 11 కి.మి దూరములో ఉంది. జంబుకేశ్వరానికి తిమేవకాయ్ మరియు తిరువనైకావల్ అనే పేర్లు కూడా ఉన్నాయి. వీటి అర్థం ప్రకారం ఇక్కడ ఏనుగుల చేత పూజలందుకొన్న క్షేత్రము అని అర్థం. పూర్వం ఇక్కడ అధికంగా జంబు వృక్షాలు ఉండడం వల్ల దీనికి జంబుకేశ్వరం అని పేరు స్థిర‌ప‌డింది. జంబు వృక్షాలంటే తెల్లనేరేడు వృక్షాలు.

స్థలపురాణం

ఇక్కడ స్థల పురాణం మీద రెండు ప్రాచుర్యములో ఉన్న కథలు ఉన్నాయి.మొదటి కథ ప్రకారం శంభుడు అనే ఋషి ఇక్కడ నివసిస్తుండేవాడు. ఆ ఋషి అత్యంత శివభక్తుడు శివుని పూజించందే మంచినీరు కూడా స్వీకరించేవాడు కాదు. కాలం గడుస్తూ వుండగా ఒకసారి శంభుడికి శివున్నిప్రత్యక్షంగా పూజించాలని కోరిక కలిగింది. ఆ విధంగా శివుని ప్రసన్నం చేసుకోవడానికి తపస్సు చేయనారంభించాడు.

శివుడు అతని తపస్సుకి మెచ్చి ప్రత్యక్షం అయి వరం కోరుకోమనగా శంభుడు తన అభీష్టం అయిన ప్రత్యక్షంగా పూజించే వరం కోరుకొన్నాడు. భోళా శంకరుడు అంగీకరించి ఇక్కడ లింగ రూపములో వెలుస్తాను, నువ్వు జంబు వృక్ష రూపంలో ఉండి నన్ను పూజించెదవు అని చెప్పి అంతర్థానం అయ్యాడు. శివుడు శంభుడికి ఇచ్చిన వరం ప్రకారం లింగంగా ఆవిర్భించగా శంభుడు జంబు వృక్షమై శివుని అర్చిస్తుంటాడు. ఆలయ ప్రాంగణంలో ఉన్న జంబువృక్షమే శంభుడిగా ఇక్కడి భక్తుల నమ్ముతారు.

మరో పౌరాణిక గాధ‌

ఇక్కడ స్వామి వారిని ఏనుగు, సాలిపురుగు పోటి పడి పూజిస్తుండేవి. ఆ శ్రీకాళహస్తి స్థలపురాణానికి సన్నిహితంగా ఉండే ఇతిహాసం ఇక్కడ కూడా వినిపిస్తుంది.జంబుకేశ్వరం పవిత్ర కావేరి నది ఒడ్డున ఉంది. స్థానికులు ఈ నదిని పొన్ని అని పిలుస్తారు. తమిళంలో పొన్ని అంటే బంగారం అని అర్థం. ఇక్కడ కావేరి నదిలో స్నానం ఆచరించడం జంబుకేశ్వరుడిగా వెలసిన శివుడిని కొలవడం చాలా శ్రేష్ఠం అని ఇక్కడి స్థానికుల నమ్మకం.

ఆలయం విశేషాలు

ఇక్కడి దేవాలయం విశాలమైన ప్రాక్రారాలతో ఎత్తైన గోపురాలతో ఉంది. దేవాలయం ఐదు ఎకరాల విస్తీర్ణంలో, ఐదు ప్రాకారాలు కలిగి ఉంది. ఆలయానికి మొత్తం ఏడు గోపురాలు ఉన్నాయి.జంబుకేశ్వర స్వామి వారు పశ్చిమాభిముఖంగా ఉన్నారు. గర్భగుడి ప్రక్కన అఖిలాండేశ్వరి ఆలయం కూడా ఉంది. ఆలయప్రాకారములో జంబుకేశ్వర స్వామి ఆలయం, అఖిలాండేశ్వరి ఆలయమే కాకుండా అనేక ఉపఆలయాలు, అనేక మండపాలతో ఈక్షేత్రం అల‌రారుతుంది.

గర్భ గుడి

జంబుకేశ్వరుడిగా పేరుపొందినప్పటికీ ఇక్కడి లింగం నీటితో నిర్మితమైంది. నీటిలో లేదు. లింగం పానపట్టం నుండి ఎల్లకాలము నీరు ఊరుతూ ఉంటుంది. ఈ విషయం భక్తులకు చూపించేందుకు లింగం పానపట్టం పై ఒక వస్త్రం కప్పుతారు. కొంతసేపటికి దానిని తీసివేసి ఆ వస్త్రాన్ని పిండుతారు. ఆ పిండిన వస్త్రం నుండి నీరు వస్తుంది. గర్భగుడిలో గవాక్షానికి “నవద్వార గవాక్షం” అని పేరు. గర్భాలయంలో ఉన్న జంబుకేశ్వరుడినే అప్పులింగేశ్వరుడు, నీర్ తిరళ్‌నాథర్ అని కూడా పిలుస్తారు.

అఖిలాండేశ్వరి ఆలయం

జంబుకేశ్వరస్వామి దేవేరి అఖిలాండేశ్వరి అమ్మవారు.అఖిలాండేశ్వరి అమ్మవారు చతుర్భుజాలతో నిలబడిన భంగిమలో ఉంటారు, నాలుగు భుజాలలో పై రెండు చేతులతో కలువలు పట్టుకొన్నట్లు, క్రింది చేతులు అభయ హస్తంతో వరద ముద్రతో ఉన్నారు. అఖిలాండేశ్వరి అమ్మవారు పూర్వం చాలా ఉగ్ర రూపంగా ఉండేవారని శంకరాచార్యులు ఈమె ఉగ్ర రూపాన్ని ఆరాధించి ఉగ్రాన్నితగ్గించడానికి తపస్సు చేసి అమ్మవారిని ప్రసన్నం చేసుకొని శాంతమూర్తిగ మార్చారని చెబుతారు.

అమ్మవారి ముందు కనిపించే శ్రీ చక్రాన్ని ప్రతిష్టించారని, అమ్మవారి కర్ణభూషణాలను కూడా శంకరాచార్యులవారే సమర్పించారని చెబుతారు. అమ్మవారి ఆలయానికి ఎదురుగా వినాయకుడు కొలువుదీరి ఉన్నాడు. ఇక్కడ వినాయకుడిని కూడా ఆదిశంకరులే ప్రతిష్ఠించారని ఇక్కడి వారి నమ్మకం.

ఆలయ నిర్వహణ బాధ్యతలు

చారిత్రక ఆధారాల ప్రకారం ఈ ఆలయం శ్రీ రంగంలో ఉన్న రంగనాథేశ్వర స్వామి ఆలయం కన్నా పురాతన మైనదని తెలుస్తోంది. క్రీ.శ. 11 వ శతాబ్దములో చోళరాజులు ఈ ఆలయాన్ని నిర్మించినట్లు ఆ తరువాత ఆలయ నిర్వహణ పల్లవ రాజులు, పాండ్యులు విజయనగర రాజులు చేసినట్లు తెలుస్తోంది. ఆలయం స్వామి దీపధుపాలతో పాటు ఉత్సవాల నిర్వహణకు మణిమాన్యాలు ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. నాయనార్లలో ప్రసిద్ధులైన సుందరర్ సంబంధర్ మొదలైనవారు స్వామిని సేవించి తరించారు. కొంత కాలం క్రితం వరకు ఈ ఆలయనిర్వహణ బాధ్యతలు కంచి కామకోటిమఠం వారు నిర్వహించారు.

Share This Article