భోగభాగ్యాలు, భోగి పండ్లు, ఆరోగ్యంతో నిండు నూరేళ్లు.. ఇదే మన భోగి

Telugu Box Office

సనాతన సంప్రదాయాలు, ధర్మాలకు భారతదేశం నెలవు. అందులోనూ హిందూధర్మంలో ఆచారాలు, పండుగలకు పెద్ద పీట వేస్తారు. హిందువులు, ముఖ్యంగా తెలుగువారు జరుపుకునే అతిపెద్ద పండుగ సంక్రాంతి. నాలుగు రోజుల పాటు జరుపుకునే ఈ పండుగను అత్యంత వైభవంగా నిర్వహిస్తారు. ముఖ్యంగా కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో సంక్రాంతిని అంగరంగ వైభవంగా జరుపుకుంటారు. భోగి, సంక్రాంతి, కనుమ, ముక్కనుమ ఇలా నాలుగు రోజుల పాటు ఈ పండుగను నిర్వహిస్తారు. సూర్యుడు మకర రాశిలో ప్రవేశించిన రోజునే మకర సంక్రాంతి వస్తుంది. ఈ పండుగ తొలి రోజును ‘భోగి’గా పిలుస్తారు. దక్షిణాయన సమయంలో సూర్యుడు దక్షిణార్థగోళానికి భూమికి దూరంగా జరగడంతో భూమిపై ఉష్ణోగ్రతలు తగ్గి చలిపెరుగుతుంది.

ఈ చలి వాతావరణాన్ని తట్టుకునేందుకు ప్రజలు సెగ కోసం భగ భగ మండే చలి మంటలు వేసుకునేవారు, ఉత్తరాయణం ముందురోజుకి చలి విపరీతంగా పెరగడం ఈ చలిని తట్టుకునేందుకు భగ భగ మండే మంటలు, దక్షిణాయణంలో ప్రజలు తాము పడిన కష్టాలను, బాధలను అగ్ని దేవుడికి ఆహుతి చేస్తూ రాబోయే ఉత్తరాయణంలో సుఖసంతోషాలను ఇమ్మని కోరుతూ వేసే మంటలు భోగి మంటలు అని పిలుస్తారు. ఈ పండుగ రోజున భోగి మంటలు ఎందుకు వేస్తారో వాటి పురాణం మరియు శాస్త్రీయ ఆధారాలు తెలుసుకుందాం.

భుగ్ అనే సంస్కృత పదం నుండి భోగి అనే పదం వచ్చింది. భోగం అంటే సుఖం. పూర్వం ఈ రోజునే రంగనాథస్వామిలో గోదాదేవి లీనమై భొగాన్ని పొందిందని దీని సంకేతంగా భోగి పండగ ఆచరణలోకి వచ్చిందనేది మన పురాణ గాథ. శ్రీ మహా విష్ణువు వామన అవతారంలో బలి చక్రవర్తిని పాతాళంలోకి తొక్కిన పురాణ గాథ మనందరికీ తెలిసిందే. అయితే తర్వాత బలి చక్రవర్తికి పాతాళ రాజుగా ఉండమని, ప్రతి సంక్రాంతికి ముందు రోజున పాతాళం నుండి భూలోకానికి వచ్చి ప్రజల్ని ఆశిర్వదించమని వరమివ్వడం జరిగిందట. బలిచక్రవర్తి రాకను ఆహ్వానించడానికి భోగి మంటలు వేస్తారని మన పురాణాలలో చెప్పబడింది. కృష్ణుడు ఇంద్రుడికి ఒక పాఠం నేర్పుతూ గోవర్ధన పర్వతం ఎత్తిన పవిత్రమైన రొజు ఇదే. శాపవశంగా పరమేశ్వరుని వాహనమైన బసవన్నని భూమికి పంపించి రైతుల పాలిట దైవాన్ని భూమికి దిగి వచ్చిన రొజు ఇదే అనేవి కూడా పురాణాల గాథ.

​శరీరాన్ని శుభ్రపరిచే భోగిమంటలు..

సాధారణంగా అందరు చెప్పేది, ఇది చలి కాలం కనుక వెచ్చదనం కోసం మంటలు వేస్తారని. కానీ నిజానికి భోగి మంటలు వెచ్చదనం కోసం మాత్రమే కాదు, ఆరోగ్యం కోసం కూడా. ధనుర్మాసం నేలంతా ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే ఈ భోగి మంటలలో వాడుతారు. దేశి ఆవు పేడ పిడకలని కాల్చడం వలన గాలి శుద్ధి అవుతుంది. సుక్ష్మక్రిములు నశిస్తాయి. ప్రాణవాయువు గాలిలోకి అధికంగా విడుదల అవుతుంది. దాని గాలి పీల్చడం ఆరోగ్యానికి మంచిది. చలికాలంలో అనేక వ్యాధులు వ్యాపిస్తాయి. ముఖ్యంగా శ్వాసకు సంబంధించిన అనేక రోగాలు పట్టి పీడిస్తాయి. వాటికి ఔషదంగా ఇది పని చేస్తుంది. భోగి మంటలు పెద్దవిగా రావడానికి అందులో రవి, మామిడి, మేడి మొదలైన ఔషధ చెట్ల బెరడ్లు వేస్తారు. అవి కాలడానికి ఆవు నెయ్యని వేస్తారు. అగ్ని హోత్రంలో వేయబడిన ప్రతి 10 గ్రాముల దేశీ ఆవు నెయ్యి నుంచి 1 టన్ను ప్రాణవాయువు (oxygen) ను విడుదల చేస్తుంది. ఈ ఔషధ మూలికలు ఆవు నెయ్యి, ఆవు పిడకలని కలిపి కాల్చడం వలన విడుదల అయ్యే గాలి అతి శక్తివంతమైంది. ఒకరికి రోగం వస్తే దానికి తగిన ఔషదం ఇవ్వవచ్చు, అదే అందరికి వస్తే అందరికి ఔషధ సమకూర్చడం దాదాపు అసాధ్యం. అందులో కొందరు వైద్యం చెయించుకొలేని పేదలు కూడా ఉండవచ్చు. ఇదంతా ఆలోచించిన మన పెద్దలు అందరు కలిసి భోగి మంటల్లో పాల్గొనే సంప్రదాయాన్ని తెచ్చారు. దాని నుండి వచ్చే గాలి అందరికి ఆరోగ్యాన్ని ఇస్తుంది. కులాలకు అతీతంగా అందరు ఒక చోట చేరడం ప్రజల మధ్య దూరం తగ్గి ఐక్యమత్యం పెరుగుతుంది. ఇది ఒకరకంగా అగ్ని దేవుడికి ఆరాధనా, మరోరకంగా గాలిని శుద్ధి చేస్తూ వాయుదేవునికి ఇచ్చే గౌరవం కూడా.

​పాత వస్తువులు కాదు.. పనికిరాని అలవాట్లు కాల్చాలి..

అయితే ఇటీవల కాలంలో మనం ఆధునికత, సృజనాత్మకత పేరుతో రబ్బరు టైర్లు, పెట్రోలు పోసి తగల బెట్టి, దాని విష వాయువులను పిలుస్తూ, కాలుష్యాన్ని పెంచుకుని మన ఆరోగ్యాన్ని పాడుచేసుకుంటున్నాం. పర్యావరణాన్ని నాశనం చేస్తూ కొత్త రోగాలని కొని తెచ్చుకుంటున్నాం. భోగి మంటల్లో పనికిరాని వస్తువులని కాల్చండి అని అంటారు. అయితే, పనికిరాని వస్తువులు అంటే ఇంట్లో ఉండే ప్లాస్టిక్ కవర్లు, వైర్లు కావు. ఇక్కడ మనం చరిత్రకి సంబంధించిన ఒక విషయం గుర్తుకు తెచ్చుకోవాలి. భారతదేశంలో ఉన్న జ్ఞాన సంపదను నాశనం చేస్తే కానీ ఆ దేశాని ఆక్రమించుకోలేమని భావించిన బ్రిటిషర్లు భోగి మంటల్లో పాత సామాన్లు తగల బెట్టాలనే నెపంతో అమాయక ప్రజలు ఎన్నో వందల ఏళ్ల నుంచి వారసత్వంగా కాపాడుకుంటూ వస్తున్నఅతి ప్రాచీన తాళపత్ర గ్రంథాలను భోగి మంటల్లో వేసి కల్పించేసారు. నిజానికి భోగి మంటల్లో వేయాల్సింది పాత వస్తువులు కాదు, మనలోని పనికి రాని అలవాట్లు, చెడు లక్షణాలు… అప్పుడే మనకున్న పీడ పోయి మానసిక ఆరోగ్యం, విజయాలు సిద్ధిస్తాయి.

Share This Article