వన్నియర్‌ vs సూర్య.. వివాదంలో ‘జై భీమ్‌’.. అండగా నిలిచిన కోలీవుడ్

Telugu Box Office

తమిళ హీరో సూర్య నటించిన ‘జై భీమ్‌’ సినిమా ఓవైపు ఓటీటీలో విజయదుంధుబి మోగిస్తుంటే.. మరోవైపు వరుస వివాదాలు చుట్టుముడుతున్నాయి. వన్నియర్‌ సామాజికవర్గ నేతలు, చిత్రబృందం మధ్య మాటల యుద్ధం సాగుతోంది. తమ వర్గాన్ని కించపరుస్తూ వాస్తవానికి విరుద్ధంగా చిత్రాన్ని తీశారని వన్నియర్ సామాజిక వర్గం వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఇది వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కించిన చిత్రం మాత్రమేనని, ఇందులోని పాత్రలు, పేర్లు మార్చామని ఆ బృందం చెబుతోంది. మొత్తానికి రోజురోజుకీ ఈ రెండు వర్గాలు పరస్పర ప్రకటనలతో వాదనలు కొనసాగుతున్నాయి.

ఓవైపు వన్నియర్‌ సంఘాలు, పాట్టాలి మక్కల్‌ కట్చి (పీఎంకే) ప్రశ్నల అస్త్రాలు సంధిస్తుండగా.. మరోవైపు సూర్య వాటికి సమాధానమిస్తూ వస్తున్నారు. ఆయనకు కోలీవుడ్ అండగా నిలుస్తోంది. జ్ఞానవేల్‌ దర్శకత్వంలో సూర్య నటించిన ‘జై భీమ్‌’ దీపావళి సందర్భంగా ఓటీటీలో విడుదలైన విషయం తెలిసిందే. 1993లో జరిగిన వాస్తవ ఘటన ఆధారంగా తెరకెక్కిన చిత్రమిది. అప్పట్లో పోలీసు యంత్రాంగం తీరు వల్ల ఓ గిరిజన వ్యక్తి ప్రాణాలు కోల్పోవడం, ఆపై అతని భార్య న్యాయపోరాటం చేయడం.. మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ప్రశ్నించడం.. న్యాయానికి హారతులు పట్టడమే చిత్ర అసలు కథ. అయితే ఇందులో పోలీసు అధికారి పాత్రను ‘వన్నియర్‌’ సామాజిక వర్గానికి సంబంధించినట్టు చిత్రీకరించడం, అందుకు ఆధారాలు చిత్రంలో అక్కడక్కడ కనిపించాయి. ఈ అంశాలే ప్రస్తుత రచ్చకు కారణాలుగా మారాయి.

అయితే సదరు సామాజిక వర్గం ప్రశ్నించిన తర్వాత ఆ వర్గానికి సంబంధించిన ఆనవాలను చిత్రంలో నుంచి తొలగించి.. మార్పులు చేసింది ‘జై భీమ్‌’ బృందం. అసలు ప్రశ్న ఏంటంటే?.. అసలు సినిమాలో ఎందుకు తమ సామాజిక వర్గాన్ని ప్రస్తావించాలి? ఆ తర్వాత ఎందుకు తొలగించాలన్నదే. అంతేకాకుండా పోలీసు అధికారి అసలు పేరు ‘ఆంథోని’ పేరును ఎందుకు వాడలేదు’, ‘న్యాయపోరాటం చేసే ఆ మహిళ అసలు పేరు పార్వతి కానీ చిత్రంలో సెంగనిగా’ మతపరంగా మరోరూపం ఇవ్వడం ఎందుకు’.. వంటి ప్రశ్నలను కూడా సంధిస్తున్నారు. ఇందుకు బహిరంగంగా సూర్య క్షమాపణలు చెప్పాలని కూడా పీఎంకే నేత అన్బుమణి రామదాసు డిమాండ్‌ చేస్తున్నారు. మరోవైపు వన్నియర్‌ సంఘం సూర్యకు లీగల్‌ నోటీసులు కూడా జారీ చేసింది.

అయితే ఇలాంటి పరిస్థితుల మధ్య ‘జైభీమ్‌’ చిత్ర నిర్మాత, నటుడు సూర్యకు చిత్ర పరిశ్రమ అండగా నిలుస్తోంది. ఈ వార్‌ ట్విట్టర్‌కు కూడా ఎక్కింది. సామాజిక వర్గ సంఘాలు, పీఎంకే పార్టీ నేతలు, కార్యకర్తలు.. సూర్య అభిమానుల మధ్య ట్వీట్ల ఘర్షణ జరుగుతోంది. సూర్యకు మద్దతుగా నిలిచేవారి #westandwithsuriya అనే హ్యాష్‌ట్యాగ్‌ ఇప్పుడు ట్రెండింగ్‌గా మారింది. అలాగే చిత్ర పరిశ్రమలోని నిర్మాతల మండలి కూడా సూర్యకు మద్దతుగా అన్బుమణికి ఓ లేఖ రాసింది. సీనియర్‌ దర్శకుడు భారతిరాజా, నటుడు సత్యరాజ్, నిర్మాత థానులతో పాటు పలువురు సినీ ప్రముఖులు కూడా అన్బుమణికి రాసిన లేఖల ద్వారా సూర్యకు సంఘీభావం ప్రకటిస్తున్నారు.

సూర్యను ఓ సామాజిక వర్గ విరోధిగా మార్చే ప్రయత్నం చేయకండని భారతిరాజా కోరారు. ఎన్నో సమస్యలుండగా సినిమాలోని ఈ విషయంపై గళమెత్తడం బాధాకరమని తెలిపారు. అలాగే సత్యరాజ్‌ స్పందిస్తూ.. ‘పలు చిత్రాలు అభినందించే రీతిలో ఉంటాయి. వాటిలో అతి కొద్ది చిత్రాలు మాత్రమే కీర్తించదగ్గ చిత్రాలుగా నిలుస్తాయి. ఆ వరుసలో ‘జై భీమ్‌’ ఉంది. సూర్య ‘ఎదర్కుం తునిందవన్‌’ (దేనికైనా రెడీ). ఆయన్ను అభినందించాల్సిన తరుణమి’దని పేర్కొన్నారు. అయితే ఈ వివాదాన్ని దీని రాద్ధాంతం చేస్తూ గోడ పత్రికలను చించడం, సూర్యను కొడితే రూ.లక్ష ఇస్తానని పీఎంకే నేత ప్రకటించడం వంటి పనులు అత్యంత దారుణమని సినీ ప్రముఖులు అభిప్రాయపడుతున్నారు. ఈ వివాదం ఎటువైపు దారి తీస్తుందో చూడాలి మరి.

Share This Article
Leave a comment